రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు నిలిపివేయించానన్న వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని స్పష్టం చేసింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని క్లారిటీ ఇచ్చింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ హయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ పై నాటి నుంచే తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. కేంద్రంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన ఎన్జీటీ… ఈ పనులను నిలిపివేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది.
ఇదే అంశంపై ఏపీ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమకు రోజుకు 3 టీఎంసీలంటూ ప్రకటనలతో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం పనులు చేపట్టిందని పేర్కొంది. ఈ లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన తర్వాత అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయించింది’’ అని ఏపీ వివరణ ఇచ్చింది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారని విమర్శిస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిచేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చిందని చెబుతోంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు బలిపెట్టారని ఆరోపిస్తోంది. తాను కోరినందునే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక విషయాలు చెప్పారని గుర్తు చేస్తోంది.