పండుగ వేళ మందు బాబులకు షాక్.. మద్యం ధరను బాటిల్కు రూ.10 పెంచిన ప్రభుత్వం
సంక్రాంతి పండుగ వేళ మందు బాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు పండుగ సమయంలో షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ రూ.99 ఉన్న మద్యం సిసాలు మినహా అన్ని రకాల బ్రాండ్లపై పరిమాణంతో సంబంధం లేకుండా రూ.10 చొప్పున పెంచింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జీఓ ఎంఎస్ 22ను జారీ చేశారు. దీని ప్రకారం, మద్యంపై రూ.99 (180 ml) ఎంఆర్పీ కలిగిన క్వార్టర్ మినహాయించి.. అన్ని బాటిళ్ల మీద రూ.10 చొప్పున ఎక్కువగా వసూలు చేస్తారు.

అంతేకాకుండా బార్ లైసెన్స్దారులపై విధిస్తున్న 15 శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం తొలగించింది. ఇక మీద మద్యం దుకాణదారులు, బార్ లైసెన్స్దారులు ఏపీఎస్బీసీఎల్ నుంచి ఒకే ధరకు మద్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-26 సంవత్సరానికి దుకాణాలకు సంబంధించి కొత్త ఎక్సైజ్ విధానాన్ని జారీ చేసింది. దీనిలో దుకాణాల సంఖ్య, పారవేసే విధానం, రిటైల్ ఎక్సైజ్ పన్ను, రిటైలర్ మార్జిన్, ఇతర అంశాలను నిర్ణయించారు.
గత డిసెంబర్ 22న మంత్రుల బృందం సమావేశమై బార్లు కొనుగోలు చేసిన మద్యం ఉత్పత్తులపై అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని(ARET) అదనపు లెవీ వల్ల కలిగే ప్రభావాలను చర్చించింది. నవంబర్ 2019కి ముందు ఏపీ రాష్ట్ర పానీయాల కార్పొరేషన్ హోల్సేల్ డిపోలు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల, ఎఫ్ఎల్ ఇన్వాయిస్ ధర బార్లు, రిటైల్ దుకాణాలు రెండింటికీ ఒకే విధంగా ఉండేదని, సరఫరా, పన్ను నిర్మాణంలో సమానత్వాన్ని నిర్ధారిస్తుందని గమనించారు. నవంబర్ 2019 నుండి బార్లకు ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ స్టాక్ సరఫరాలపై ప్రత్యేకంగా రిటైల్ ఎక్సైజ్ పన్నును అదనంగా విధించారు. దీని ఫలితంగా అదే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ స్టాక్ల రిటైల్ దుకాణాలతో పోలిస్తే బార్లకు ఇన్వాయిస్ ధర ఎక్కువగా ఉంది. కాబట్టి బార్లు అదనపు ARET చెల్లిస్తున్నాయి.
మైక్రో బ్రూవరీలపై కూడా తాజాగా అప్డేట్ వచ్చింది. పర్యాటక కేంద్రాలలో, 3 స్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్లలో, వాటి స్థానంతో సంబంధం లేకుండా.. అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిమితుల నుండి 5 కి.మీ బెల్ట్ లోపల వాటిని స్థాపించడానికి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిమితుల నుండి 5 కి.మీ బెల్ట్ లోపల, పర్యాటక కేంద్రాలలో, త్రీ స్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్లలో మైక్రో బ్రూవరీలకు అనుమతి లభిస్తుంది. 2006 ఏపీ బ్రూవరీ నిబంధనలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీన ఉత్తర్వులు జారీ చేశారు.

E-Paper












