పొగాకు ఉత్పత్తిదారులు, కంపెనీల చిహ్నాలు, ప్రచారం ప్రభుత్వ శాఖల్లో లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. సదరు సంస్థ భాగస్వామ్యంతో క్రీడలు కానీ, సాంస్కృతిక, ఇతర ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని స్పష్టం చేసింది.
కేంద్రం నుంచి మార్గదర్శకాలు…

పొగాకు వాడకం తగ్గింపు చర్యల్లో భాగంగా పొగాకు ఉత్పత్తిదారులు, కంపెనీలతో స్పాన్సర్ షిప్, ఒప్పందాలు చేసుకోకూడదని, ఇతర నియంత్రణ చర్యలు పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవలే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీచేసింది. వీటిపై ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహన కల్పించే నిమిత్తం విజయవాడలో బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేకమైన వర్క్ షాప్ ను నిర్వహించింది.
ఈ వర్క్ షాప్ నకు పోలీసు, పంచాయతీ రాజ్, పర్యాటక, మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ, పాఠశాల, ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్య శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) రూపొందించిన ఎఫ్ సీటీసీ (ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ అన్ టూబాకో కంట్రోల్) ఆర్టికల్ 5.3 అమలు గురించిపై చర్చించారు. ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వైటల్ స్ట్రాటజీస్ సంస్థ ముఖ్య ప్రతినిధులు డాక్టర్ అమిత్ యాదవ్, డాక్టర్ శివంకపూర్ మాట్లాడారు.
" ప్రజారోగ్యంపై పొగాకు పరిశ్రమల ప్రభావం ప్రపంచ స్థాయిలో భారత్ 43వ స్థానంలో ఉంది. పొగాకు వాడకంవల్ల 1.3 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారు. పొగాకు వాడకంతో ఓరల్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దేశ జనాభాలో 28% మంది పొగాకును ఏదోరకంగా వాడుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పొగాకు నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు కంపెనీల ప్రచారాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటుంది. డబ్ల్యూహెచ్ రూపొందించిన ఆర్టికల్-5.3 అమలు దేశంలోని 25 రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ శాఖలు కూడా చర్యలు తీసుకోవాలి' అని వారు వివరించారు. వర్చువల్ లో డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధి ప్రవీణ్ సిన్హా కూడా కార్యశాలను ఉద్దేశించి ప్రసంగించారు.