రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఏపీ ఐసెట్ 2026' మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా… తాజాగా వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అర్హత సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, ప్రాధాన్యత కలిగిన కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల గడువు : అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ వరకు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల నమోదు : రిజిస్ట్రేషన్లు పూర్తయిన విద్యార్థులు సెప్టెంబర్ 2వ తేదీ వరకు తమకు కావలసిన కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఆప్షన్లలో మార్పులకు అవకాశం : నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా సవరణలు లేదా మార్పుచేర్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 3న ఒక్క రోజు అవకాశం కల్పించారు. అదే రోజు రాత్రి 10:00 గంటలకు ఆప్షన్లు స్వయంచాలకంగా ఫ్రీజ్ అవుతాయి.
- సీట్ల కేటాయింపు : అభ్యర్థులు సాధించిన మెరిట్ ర్యాంకు, సామాజిక రిజర్వేషన్లు, నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ప్రాధాన్యత ఆధారంగా సెప్టెంబర్ 7న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
- సెల్ఫ్ జాయినింగ్ - రిపోర్టింగ్ : సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ మధ్య ఆన్లైన్లో సెల్ఫ్ జాయినింగ్ ప్రాసెస్ పూర్తి చేయడంతో పాటు, కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై సర్టిఫికెట్ల సమర్పణతో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
- తరగతుల ప్రారంభం : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లోనూ సెప్టెంబర్ 8 నుంచే నూతన విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,198 మంది ప్రవేశ పరీక్ష రాశారు. పరీక్షా ఫలితాల్లో ఏకంగా 21,205 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి కౌన్సెలింగ్కు అర్హత పొందారు. అంటే ఈసారి ఐసెట్లో ఏకంగా 91.41 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని ప్రవేశాల విభాగం వెల్లడించింది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్…
- అభ్యర్థులు ముందుగా ఏపీ సీఏపీ అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ ( https://cap.apcfss.in/ ) ను సందర్శించాలి.
- హోమ్పేజీలో కనిపించే 'Register Now' ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- లాగిన్ ఐడీ క్రియేట్ అయిన తర్వాత, అడిగిన విద్యార్హతల సర్టిఫికెట్లను స్పష్టంగా అప్లోడ్ చేసి, నిర్ణీత ప్రాసెసింగ్ రుసుమును ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
- మీ లాగిన్ వివరాల ఆధారంగా వెబ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు.