AP TET 2025 : నేటి నుంచి ఏపీ ‘టెట్’ పరీక్షలు ప్రారంభం - అభ్యర్థులకు కీలక సూచనలు
ఇవాళ్టి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.ఈ నెల 21వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
నేటి నుంచి ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ డిసెంబర్–2025) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 21వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.

ప్రతి రోజూ 2 సెషన్లు…
రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఈసారి జరిగే టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్కు 32 వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థులకు కీలక సూచనలు…
ఏపీ టెట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉంటే నామినల్ రోల్స్లో సరిదిద్దుకునేందుకు ఆయా పరీక్ష సెంటర్ల వద్ద సరైన ధ్రువీకరణపత్రాలు చూపించి మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఐడెంట్టి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్, ఇయర్ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి కనీసం 60 నిమిషాల ముందే చేరుకోవాలి. రిపోర్టింగ్ టైం దాటి వచ్చిన అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉండదు కాబట్టి త్వరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలిపరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది.
విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ(డిసెంబర్ 10) తెలుగు లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. డిసెంబర్ 11వ తేదీన పలు భాషాలకు సంబంధించిన పరీక్షలుంటాయి. 17వ తేదీన సోషల్ స్టడీస్, 19వ తేదీన మ్యాథ్స్ అండ్ సైన్స్ తో పాటు ఇతర సబ్జెక్టుల పేపర్లను నిర్వహిస్తారు. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.
జనవరిలో టెట్ ఫలితాలు…
జనవరి 2వ తేదీన ఏపీ టెట్ ఎగ్జామ్స్ ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 13వ తేదీన ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.
మరోవైపు ఏపీ టెట్ కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్లైన్ మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు మాక్ టెస్టులు కూడా రాసుకోవచ్చు. ఇతర ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.














