ఏపీ ట్రాన్స్కో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి విప్లవాత్మక అడుగులు వేస్తోంది. విద్యుత్ లైన్ల తనిఖీ, నిర్వహణ కోసం అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ ఉపయోగానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా విద్యుత్ టవర్ల నాణ్యతను తనిఖీ చేయడానికి సిబ్బంది నేరుగా వెళ్లేవారు. దీనికి తీవ్ర సమయం పట్టడమే కాకుండా కొన్ని సమస్యలను సరిగ్గా గుర్తించడం కష్టమయ్యేది. ఈ సమస్యలు దాటేందుకు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది.

డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ను రెండు సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. దాదాపు 23,000 విద్యుత్ టవర్లు, 8,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ ఎక్స్ట్రా హై వోల్టేజ్ (EHV) లైన్లను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తారు.
ఈ ప్రయోగం విజయం సాధిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33,000 కిలోమీటర్ల ట్రాన్స్కో లైన్లకు డ్రోన్ పెట్రోలింగ్ను విస్తరింపజేస్తారు. ప్రత్యేక సెన్సార్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు కలిగిన డ్రోన్లు టవర్ల పైభాగం, కేబుళ్లు, నట్లు, బోల్టులు, ఇన్సులేటర్స్ వంటి ప్రతీ విడిభాగం హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీస్తాయి.
డ్రోన్లు సేకరించిన చిత్రాలను ఏఐ సాఫ్ట్వేర్ సహాయంతో విశ్లేషిస్తారు. టవర్లలో లేదా లైన్లలో ఎక్కడైనా లోపాలు, వేడి పెరగడం ఉంటే వెంటనే గుర్తించి, సరిచేస్తారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఏపీ ట్రాన్స్కో సంస్థ స్వయంగా కొన్ని ఏఐ టూల్స్ను సొంతంగా అభివృద్ధి చేస్తోంది.
సాంకేతిక లోపాలను ముందుగానే గుర్తించి సరిచేయడం వల్ల అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోయే సమస్య తగ్గుతుంది. మనుషులు రోజులు తరబడి చేసే తనిఖీలను డ్రోన్లు కొద్ది గంటల్లోనే పూర్తి చేస్తాయి. దీనివల్ల ప్రసరణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. విద్యుత్ గ్రిడ్ స్థిరత్వానికి డ్రోన్ పెట్రోలింగ్ ఎంతగానో తోడ్పడుతుంది. పవర్గ్రిడ్ కార్పొరేషన్ సాధించిన విజయవంతమైన అనుభవాల ఆధారంగా ఏపీ ట్రాన్స్కో ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాణ్యమైన, సురక్షితమైన విద్యుత్తును వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏపీ ట్రాన్స్కో ముందుకు సాగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నిబంధనలకు అనుగుణంగా ఉండేలా డ్రోన్లను వినియోగించనున్నారు.
{{/usCountry}}ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాణ్యమైన, సురక్షితమైన విద్యుత్తును వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏపీ ట్రాన్స్కో ముందుకు సాగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నిబంధనలకు అనుగుణంగా ఉండేలా డ్రోన్లను వినియోగించనున్నారు.
{{/usCountry}}