...
...
Next Story

AP TRANSCO : ఏపీ ట్రాన్స్‌కో బిగ్ ప్లాన్.. టవర్ల పైకెక్కక్కర్లేదు.. డ్రోన్ పెట్రోలింగ్

AP TRANSCO : ఏపీ ట్రాన్స్‌కో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ లైన్ల తనిఖీ, నిర్వహణ కోసం డ్రోన్ పెట్రోలింగ్‌ను తీసుకువస్తుంది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానిస్తోంది.

Published on: Sep 5, 2026, 05:43:14 IST
Advertisement

ఏపీ ట్రాన్స్‌కో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి విప్లవాత్మక అడుగులు వేస్తోంది. విద్యుత్ లైన్ల తనిఖీ, నిర్వహణ కోసం అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ ఉపయోగానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా విద్యుత్ టవర్ల నాణ్యతను తనిఖీ చేయడానికి సిబ్బంది నేరుగా వెళ్లేవారు. దీనికి తీవ్ర సమయం పట్టడమే కాకుండా కొన్ని సమస్యలను సరిగ్గా గుర్తించడం కష్టమయ్యేది. ఈ సమస్యలు దాటేందుకు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది.

డ్రోన్ పెట్రోలింగ్
డ్రోన్ పెట్రోలింగ్

డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. దాదాపు 23,000 విద్యుత్ టవర్లు, 8,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ ఎక్స్‌ట్రా హై వోల్టేజ్ (EHV) లైన్లను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తారు.

ఈ ప్రయోగం విజయం సాధిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33,000 కిలోమీటర్ల ట్రాన్స్‌కో లైన్లకు డ్రోన్ పెట్రోలింగ్‌ను విస్తరింపజేస్తారు. ప్రత్యేక సెన్సార్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు కలిగిన డ్రోన్లు టవర్ల పైభాగం, కేబుళ్లు, నట్లు, బోల్టులు, ఇన్సులేటర్స్ వంటి ప్రతీ విడిభాగం హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీస్తాయి.

డ్రోన్లు సేకరించిన చిత్రాలను ఏఐ సాఫ్ట్‌వేర్ సహాయంతో విశ్లేషిస్తారు. టవర్లలో లేదా లైన్లలో ఎక్కడైనా లోపాలు, వేడి పెరగడం ఉంటే వెంటనే గుర్తించి, సరిచేస్తారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఏపీ ట్రాన్స్‌కో సంస్థ స్వయంగా కొన్ని ఏఐ టూల్స్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తోంది.

సాంకేతిక లోపాలను ముందుగానే గుర్తించి సరిచేయడం వల్ల అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోయే సమస్య తగ్గుతుంది. మనుషులు రోజులు తరబడి చేసే తనిఖీలను డ్రోన్లు కొద్ది గంటల్లోనే పూర్తి చేస్తాయి. దీనివల్ల ప్రసరణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. విద్యుత్ గ్రిడ్ స్థిరత్వానికి డ్రోన్ పెట్రోలింగ్ ఎంతగానో తోడ్పడుతుంది. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సాధించిన విజయవంతమైన అనుభవాల ఆధారంగా ఏపీ ట్రాన్స్‌కో ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe