APCRDA : రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు
రాజధాని అమరావతి రైతులకు ఇ-లాటరీ ద్వారా 115 ప్లాట్లను కేటాయించారు. నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరిగింది. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పూర్తి పారదర్శకంగా నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ ప్రక్రియ పూర్తి చేసారు. మొత్తం 16 సీఆర్డీఏ యూనిట్ల పరిధిలోని గ్రామాలకు సంబంధించి 145 ప్లాట్లు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే వీటిలో 15 ప్లాట్లకు సంబంధించిన కొంతమంది రైతులు గురువారం సాయంత్రం తమకు ప్రస్తుతానికి ప్లాట్ల కేటాయింపు వాయిదావేయాలని కోరారు. వీటితో పాటు శుక్రవారం(ఈరోజు)ఉదయం లాటరీ ప్రక్రియ ప్రారంభానికి ముందు సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచిన లేఅవుట్ పరిశీలించిన తర్వాత మరో 15 ప్లాట్లకు చెందిన రైతులు కూడా వాయిదావేయాలని కోరారు.ఈ మొత్తం 30 ప్లాట్లను మినహాయించి మిగిలిన 115 ప్లాట్లను లాటరీ ద్వారా రైతులకు కేటాయించారు.
రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఎక్కడా రోడ్డు శూల లేకుండా...అలాగే సీఆర్డీఏకు భూమి ఇవ్వని రైతుల ప్లాట్లలో ఎక్కడా కేటాయించలేదని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. అయితే కొంతమంది దక్షిణపు ముఖం ఉన్న ప్లాట్లను తీసుకోవడానికి అంగీకరించడం లేదని చెప్పారు. కానీ దక్షిణపు ముఖం ప్లాట్లు రోడ్డు శూల ప్లాట్లుగా పరిగణించకూడదని,గతంలో కూడా ఇదే విధంగా ప్లాట్లు కేటాయించామని అధికారులు తెలిపారు.
మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో కొన్ని ప్లాట్లు పల్లపు ప్రాంతంలో ఉన్నవని,సమాధులు దగ్గరగా ఉన్న ప్రాంతంలో కేటాయిస్తున్నారని కొంతమంది రైతులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని అధికారులు చెప్పారు.ఇలాంటి ప్లాట్లను రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్ నిబంధనల ప్రకారం పూర్తిగా అభివృద్ది చేసి ఇస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయింపు వివరాలు…
- కురగల్లు - 1&2 - 5
- వెలగపూడి - 10
- మందడం -1&2 -15
- నిడమర్రు - 1&2 - 58
- పెనుమాక - 6
- నెక్కల్లు - 1
- అనంతవరం -1
- నేలపాడు - 2
- దొండపాడు -1
- లింగాయపాలెం -6
- మల్కాపురం - 10

E-Paper












