ఇంటి ముందు విద్యుత్ స్తంభాలు ఇబ్బంది పెడుతున్నాయా? మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన..

విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలుస్తోందని వెల్లడించారు.

Published on: Feb 17, 2026, 19:21:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ప్రతి జిల్లాకు రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇళ్లకు సమీపంగా, ఇళ్ల పై మీదుగా వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా చోటుచేసుకుంటున్న విద్యుత్ ప్రమాదాలపై శాసనసభలో నెలిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. విద్యుత్ పంపిణీ లైన్లు అన్ని నియమ నిబంధనల ప్రకారమే వేస్తున్నామని మంత్రి తెలిపారు.

మంత్రి గొట్టిపాటి రవి కుమార్
మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అయితే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్లే భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అవగాహన లోపం, లైన్ల కింద నిర్మాణాలే ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి శాసన సభలో వివరించారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లు లేదా స్తంభాలు ఎక్కడైనా గుర్తిస్తే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.

'లైన్లు లేదా స్తంభాల మార్పిడికి సంబంధికులు దరఖాస్తు చేస్తే, పరిశీలించి మార్పులు చేపడతాం. విజయనగరం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎంపీ నిధుల ద్వారా విద్యుత్ లైన్ల మార్పిడి చేపట్టాం. ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదు. విద్యుత్ ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులు పామాయిల్ తోటల్లో కోత కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటి నివారణకు చర్యలు చేపట్టాం. ఇకపై విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు అనుమతులు ఇవ్వకూడదు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు.

ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ. 1.50కే విద్యుత్

కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఎల్లవేళలా అండగా నిలుస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీ అమలుపై అసెంబ్లీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆక్వాకల్చర్‌కు విద్యుత్ సబ్సిడీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆక్వాకు సంబంధించి జోన్-నాన్ జోన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఫిషరీస్ శాఖ సమగ్రంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు.

ఏపీఈఆర్సీ ఆదేశాల ప్రకారం ఆక్వాకల్చర్‌కు యూనిట్‌కు రూ. 3.85 వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ... ఆక్వా రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం రూ. 2.35 సబ్సిడీ భారం భరిస్తూ యూనిట్‌ను కేవలం రూ. 1.50 కే అందిస్తున్నదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నోటిఫైడ్ ఆక్వాకల్చర్ జోన్‌ పేరుతో కేవలం పది ఎకరాలకే పరిమితం చేశారని మంత్రి గొట్టిపాటి అసెంబ్లీ వేదికగా సభ్యులకు వివరించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిమితులను సవరించి రైతులకు అనుకూల నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 50 వేల అదనపు ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల 21 వేల మంది ఆక్వా రైతులు యూనిట్‌కు రూ. 1.50 చెల్లిస్తూ సబ్సిడీ ప్రయోజనం పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More