సింహాచలం వెళ్తున్నారా? టెంపుల్‌లో పూర్తిగా క్యాష్‌లెస్ విధానం.. కొత్త రూల్స్ ఇవే!

విశాఖపట్నం : సింహాచలంలో మెుత్తం క్యాష్‌లెస్ విధానం వైపు దేవస్థానం అడుగులు వేస్తోంది. త్వరలో ఈ విధానాన్ని పూర్తి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.

Published on: May 25, 2026, 15:07:00 IST
By , Simhachalam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పన్న ఆలయాన్ని త్వరలోనే పూర్తిగా నగదు రహిత (Fully Cashless) క్షేత్రంగా మార్చేందుకు ఆలయ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా సేవలందించేందుకు డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

సింహాచలం
సింహాచలం

ఈ మేరకు సోమవారం (మే 25, 2026) దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లెపల్లి వెంకటరావు ఒక ప్రకటన విడుదల చేశారు. క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు దర్శనం, ప్రసాదం, ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్‌ను పూర్తిగా డిజిటల్ ఛానళ్ల ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుని సులభంగా స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

ఆలయంలో మొబైల్ ఫోన్ల డిపాజిట్ కౌంటర్ల వద్ద పాటించాల్సిన నిబంధనలను ఈఓ వివరించారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ కౌంటర్లలో అప్పగించడానికి ముందే.. ఫోన్ల ద్వారా తమకు కావలసిన అన్ని రకాల సేవా మరియు దర్శన టికెట్లను కొనుగోలు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ సముదాయం అంతటా క్యూఆర్ కోడ్‌లను (QR Codes) ఏర్పాటు చేశారు. వీటిని స్కాన్ చేయడం ద్వారా ప్రతి సేవకు సులభంగా నగదు రహిత చెల్లింపులు చేయవచ్చు. ఈ మార్పుకు భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈఓ వెంకటరావు విజ్ఞప్తి చేశారు.

4 రకాలుగా డిజిటల్ సేవలు

భక్తులు నగదు రహిత సౌకర్యాలను ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా వినియోగించుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్: దర్శన టికెట్లు, వసతి గదులను ముందుగానే బుక్ చేసుకోవడానికి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు.

'మనమిత్ర' మొబైల్ యాప్ : టికెటింగ్, తాజా అప్‌డేట్లు, డిజిటల్ చెల్లింపుల కోసం ఈ ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు : టికెట్లు జారీ చేసేందుకు ఆలయ ప్రాంగణంలో పలుచోట్ల కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు.

క్యూఆర్ కోడ్ పాయింట్లు: ప్రధాన కౌంటర్ల వద్ద పేమెంట్స్ చేయడం కోసం క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచారు.

సింహాచలం దేవస్థానం తీసుకున్న ఈ డిజిటల్ నిర్ణయం వల్ల దళారుల బెడద తప్పడమే కాకుండా, సామాన్య భక్తులకు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే శ్రమ తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు.

భక్తులకు గమనిక

  • అప్పన్న దర్శనానికి వెళ్లే ముందే మీ దర్శన టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ aptemples.ap.gov.in లేదా సింహాచలం అధికారిక పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవడం మంచిది.
  • ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించరు. ఫోన్ డిపాజిట్ కౌంటర్‌కు వెళ్లే ముందే, మీ ఫోన్ ద్వారా ప్రసాదం లేదా ఇతర సేవా టికెట్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల భక్తులకు సహాయం చేయడానికి ఆలయ సిబ్బంది (డిజిటల్ వాలంటీర్లు) కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటారు.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More