ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడనుంది. ఇవాళ లోక్సభలో ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ హోంశాఖ రంగం సిద్ధం చేసింది.

విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేయనుంది. ముందుగా ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెడుతారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏపీ రాజధాని విషయం - ఇప్పటి వరకు ఏం జరిగింది..?
- 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఈ సమయంలో తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకు కూడా హైదరాబాద్ ను రాజధానిగా ఉంటుంది. అంటే పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది.
- 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించింది. పనులు కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు.
- శాససనభ, హైకోర్టు, సచివాలయంతో పాటు పలు భవనాల నిర్మాణాలు జరిగాయి. వీటిలో తాత్కాలిక భవనాలు కొన్ని ఉన్నాయి.
- 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో సీన్ మారిపోయింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కానీ మండలిలో ఆమోదముద్ర లభించలేదు. మూడు రాజధానుల ప్రకారం… అమరావతి కేవలం శాసన రాజధానిగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం తెలిపింది. అనేక కోర్టు కేసుల నేపథ్యంలో… ఈ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గిపోయింది. మరోవైపు అమరావతి పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో రాష్ట్ర రాజధాని విషయంలో సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది.
- 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ అమరావతి పట్టాలెక్కింది. చంద్రబాబు నేతృత్వంలోనే ప్రభుత్వం…. పనులను వేగవంతం చేసింది.
- అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ.. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
- అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనుంది.
- ఉమ్మడి రాజధానిగా నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5ను సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోంది. రాజధానిగా అమరావతి హోదాపై చట్టపరమైన స్పష్టతను అందించేందుకు.. ఈ సవరణను 2024 జూన్ 2 నుండి అమలులోకి వచ్చేలా ప్రతిపాదించారు.
- విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో ఆ కాల పరిమితి ముగిశాక తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్, ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి కొత్త రాజధాని’ ఉంటుంది అన్న పదాన్ని మార్చి దాని స్థానంలో అమరావతి రాజధానిగా ఉంటుంది అని చేర్చారు.
- ఇవాళ లోక్ సభలో ప్రవేశపెడుతారు. ఇక్కడ ఆమోదముద్ర లభించిన తర్వాత… రాజ్యసభ ముందుకు తీసుకువస్తారు. ఆ తర్వాత గెజిట్ విడుదలైతే… అమరావతి ఏపీ రాజధానిగా గుర్తింపు పొందనుంది.
- ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని చేరుస్తూ ఏపీ పునర్విభజన చట్టానికి మూడోసారి సవరణ చేస్తున్నారు. గతంలో విలీన మండలాలు, ఎమ్మెల్సీల సీట్ల విషయంలో సవరణ చేశారు.
- ఈ బిల్లుకు ఆమోదముద్ర లభిస్తే… ఇకపై అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభిస్తుంది.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}