...
...
Next Story

పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత‌నివ్వండి - కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు.కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో కూడా సమావేశమయ్యారు.

Published on: Dec 19, 2025, 13:33:27 IST
Advertisement

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచే పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కాగా… రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు.

కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు
కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు

విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని వివరించి పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని గుర్తు చేశారు.

ఆర్థిక మంత్రితో భేటీ…

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో భేటీ అయ్యారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా కరవు పీడిత ప్రాంతాలైన ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. 2026-27 కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

విద్య, నైపుణ్యాకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని కోరారు.రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe