'స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు... ప్రజలకు అవగాహన కల్పించండి' - సీఎం చంద్రబాబు
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని..గ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని అధికారులు వివరించారు.
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్తో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ క్రమంలో చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి సౌరభ్ గౌర్ వివరించారు.
విజయనగరానికి చెందిన రాజేశ్వరీ అనే మహిళను చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని తెలిపారు. దీంతో ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారని... ఆ తర్వాత రాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేల్చారని సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారని అధికారులు చెప్పారు. స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, అలాగే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోననే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
అంటువ్యాధి కాదు…
ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు... మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని ముఖ్యమంత్రికి వివరించారు.
సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అధికారులు చూడాలన్నారు. ఏవైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయించేలా చూడాలని... వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన చికిత్స అందించేలా వైద్యారోగ్య శాఖ సిద్దంగా ఉండాలని సూచించారు.
ఈ ఏడాదిలో చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు. చిన్న చిన్న కీటకాలు కుడితే మృత్యువాత పడే స్థాయికి పరిస్థితి రాకూడదని... పూర్తిస్థాయిలో అవగాహన పెంచడమే దీనికి సరైన మార్గమని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆందోళన వద్దు - వైద్యారోగ్యశాఖ మంత్రి
స్క్రబ్ టైఫస్ జ్వరాలవల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సాధారణ జ్వరాల్లో ఇదొకటని పేర్కొన్నారు. జ్వరం వచ్చి మూడురోజుల వరకు తగ్గకుంటే రక్త పరీక్షల ద్వారా మలేరియా, డెంగీ లాంటి జ్వరాల మాదిరిగానే స్క్రబ్-టైఫస్ ను కూడా గుర్తిస్తారని తెలిపారు.
చిన్న నల్ల మచ్చ (దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్ గా అనుమానించవచ్చునని తెలిపారు. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చునని చెప్పారు. జ్వరాలకు గురైన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు కొన్ని స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయని చెప్పారు. మరణాలు ఇంతవరకు నమోదుకాలేదని పేర్కొన్నారు.













