ప్రకృతి వ్యవసాయంపై ఏపీ సర్కార్ ఫోకస్ - 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం..! త్వరలోనే శిక్షణా తరగతులు

ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.

Published on: Feb 04, 2026 5:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు.. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతగా అమలు చేస్తూ... 2030-31 నాటికి 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు.

ప్రకృతి సాగుకు సంబంధించి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ వంటివి ఈ ఏడాది ఏప్రిల్ కల్లా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే జూన్ నాటికి రాష్ట్రమంతటా పూర్తి కావాలని ముఖ్యమంత్రి సూచించారు. సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.

500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్... ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలన్నారు. మామిడి, కోకో, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటల సాగుకు అవకాశాలు ఉన్నాయని... రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు.

స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్దఎత్తున కుంకుమపువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు. ఆక్వా సాగు వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్‌ను రైతులకే ఇవ్వాలని సీఎం నిర్దేశించారు.

కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించినట్టే మన పంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పలు ఫెస్టివల్స్ నిర్వహణకు ఆలోచన చేయాలన్నారు. దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం అవుతుందన్నారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైల్ బోగీలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.

మార్కెట్ యార్డులు ఉన్నచోట రైతు బజార్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట రైతు బజార్లను ఆధునీకరించాలన్నారు. విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు.

సమీక్షలో భాగంగా డిజి రైతు బజార్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కూరగాయలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ఫార్మ్ మిషనరీ కోసం ఏపీఏఐఎంఎస్ యాప్‌ను, కిసాన్ డ్రోన్ యాప్‌ను ప్రారంభించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, డ్రోన్లు, గడ్డికోత మిషన్లు, పవర్ టిల్లర్లు, బేలర్లను బుక్ చేసుకుని సేవలు పొందవచ్చు.