విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఇక అన్ని సేవలూ ఆన్లైన్లోనే.. దేవస్థానం కీలక నిర్ణయం
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఇక అన్ని సేవలూ ఆన్లైన్లోనే ఉండనున్నాయి. ఈ మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(కనక దుర్గ ఆలయం) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శన టికెట్లతోపాటుగా అన్ని సేవలు ఆన్లైన్లోనే పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు దేవస్థానం.. భక్తులకు పారదర్శకతను పెంచడానికి, సౌకర్యార్థం త్వరలో మెుత్తం ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఈ వివరాలు వెల్లడించారు.

దర్శనం టిక్కెట్లు, సేవా బుకింగ్లు, ప్రసాదం, విరాళాలు, రిజిస్ట్రేషన్లు త్వరలో ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని దేవస్థానం వెల్లడించింది. ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in వెబ్సైట్లులో బుక్ చేయవచ్చు. లేదంటే కనకదుర్గమ్మ ఆలయ మొబైల్ యాప్, మనమిత్ర వాట్సప్ సేవ 9552300009 కూడా చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేస్తారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానంలో నగదు రహిత చెల్లింపులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్శనాలు, ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలు, కేశఖండన, అన్ని విరాళాలు.. ఇకపై డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరపనున్నారు. భక్తులు ఈ సేవలను ఉపయోగించాలని దేవస్థానం కోరింది. డిజిటల్ చెల్లింపులతో అక్రమాలకు అడ్డుపడనుంది. ఇప్పటిదాకా ఎక్కువగా భౌతికంగానే టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్స్తో నేరుగా దేవస్థానం ఖాతాలోకి వెళ్తాయి.
ఆన్లైన్ విరాళాలు, ఇ-హుండీ, దర్శనం, సేవా బుకింగ్లు త్వరలో www.aptemple.org, http://www.aptemples.org, మన మిత్ర యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని ఈవో శీనానాయక్ చెప్పారు.
2025 భవాని దీక్ష సమయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక మొబైల్ యాప్, 300కు పైగా సీసీటీవీ కెమెరాలకు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఉపయోగించినట్లు దేవస్థానం తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ దీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఇందులో సుమారు 6 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ ఈవో చెప్పారు.
లక్ష్మీ నరసయ్య చౌదరి అనే భక్తుడు రూ. 10.13 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్ సిస్టమ్లను విరాళంగా ఇచ్చారని ఆలయ యాజమాన్యం తెలిపింది. ఆయన కృతజ్ఞతలు తెలియజేసింది.

E-Paper












