ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమీక్షలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొనగా… వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రకటిచించారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
కొరత లేకుండా చూడండి - సీఎం ఆదేశాలు
ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలన్నారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత పెరిగేలా చూడాలని… గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
“రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలి. ఏపీలోని కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలి. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.