...
...
Next Story

'మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం - సర్వే త్వరగా పూర్తి చేయండి' - సీఎం చంద్రబాబు ఆదేశాలు

వచ్చే మూడేళ్లల్లో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతీ మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాలుంటాయని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Published on: Nov 22, 2025, 09:08:45 IST
Advertisement

రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”హసింగ్ ఫర్ ఆల్ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకుపైగా ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఇది ఇక్కడితో ఆగకూడదు... మరింత వేగంగా వెళ్లాలి. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలి" అని దిశానిర్దేశం చేశారు.

3 ఏళ్లల్లో పూర్తి చేయాలి - సీఎం చంద్రబాబు

“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తై గృహ ప్రవేశాలు చేసుకున్నాం. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే మూడేళ్లల్లో పూర్తి అవ్వాలి. ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.

"గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వండి. అలాగే తమకు స్థలాలు ఉన్నాయని లబ్దిదారులు చెబితే... వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అప్డేట్ ఆన్ లైన్లో ఉండేలా చూడాలి. ఇక ఉమ్మడి కుటుంబాలను ప్రొత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలి. పీఎంఏవై 1.0 హౌసింగ్ స్కీములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ వంటి సామాజిక వర్గాలకు అదనంగా చెల్లిపులు జరుపుతున్నాం. ఇప్పుడు ముస్లిం మైనార్టీలకూ అదనంగా రూ. 50 వేలు చెల్లిస్తాం. దీని కోసం 18 వేల ముస్లిం మైనార్టీల లబ్దిదారులకు రూ.90 కోట్లు అవసరమవుతాయి. మనం ఆయా వర్గాలకు చేకూరుస్తోన్న అదనపు సాయాన్ని వారికి వివరించాలి” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఈ సమీక్ష సమావేశంలో 2014-19 మధ్య 8 లక్షల గృహాలు, 2019-24 మధ్య 5.80 లక్షల ఇళ్లను నాటి ప్రభుత్వం నిర్మించినట్టు అధికారులు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్ధసారధి, టిడ్కో, హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe