వరల్డ్ ఎకనామిక్ ఫోరం : ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ అంగీకారం

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ తోడ్పాటు అందించనుంది. యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామని సీఎం చంద్రబాబుతో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ చెప్పారు.

Published on: Jan 20, 2026, 13:29:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది.

యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ పని చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. అలాగే యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్ మార్రీకి ముఖ్యమంత్రి వివరించారు.

యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ చేశారు. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు, డీపీ వరల్డ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధి, ఏడీఎన్‌ఓసీ సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు, విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైనా కూడా మాట్లాడారు.

యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భవిష్యత్‌లో యూఏఈ ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More