వేట్లపాలెం పేలుడు ఘటన : నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం - డిప్యూటీ సీఎం పవన్
నిబంధనల ఉల్లంఘనలే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జీజీహెచ్ లో బాధితులను పరామర్శించిన ఆయన… భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు.
యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తుండడం దారుణమన్నారు.

నిబంధనలు కఠినతరం చేస్తాం - డిప్యూటీ సీఎం పవన్
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సామర్లకోట మండలం, వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారని తెలిపారు.
“ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చే ముందు సీఎంతో చర్చించాం. నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించాం. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
20 మంది మృతి…
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న మరో 9 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.
పేలుళ్ల ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. పచ్చిన పొలాల మధ్య జరిగిన ఈ భీకరమైన పేలుడు… తీవ్ర శోకాన్ని మిగిల్చాయి. ఓ దశలో చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

