కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తేవాలన్నారు.

Published on: Jan 07, 2026 3:08 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీటీడీలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.

టీటీడీ సమావేశం
టీటీడీ సమావేశం

ఈ సందర్భంగా ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. అమరావతి వేంకటపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టీటీడీ కల్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5 వేల భజన మందిరాలను, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఉపమాకలోని ఎస్వీ ఆలయం, కరీంనగర్‌లోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం ఎస్వీ ఆలయం, కుప్పంలో నిర్మించనున్న ఆలయాలు, నవీ ముంబైలోని ఎస్వీ ఆలయం, ముంబైలోని భాంద్రా, కర్నాటకలోని బెల్గావిలోని ఎస్వీ ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పీఏసీ తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు బీఆర్ నాయుడు.

అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడు విగ్రహ ఏర్పాటు తదితర పనులతో పాటు టీటీడీలో జరుగుతున్న పనులను సకాలంలో, జరుగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. అలిపిరిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న బేస్ క్యాంప్‌నకు డిజైన్‌లను తయారు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇంజినీరింగ్ పనులను గడవులోపు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.

వచ్చే వేసవి సమయానికి భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాం, క్యూలైన్లు, రహదారులు, తాగునీరు తదితర సౌకర్యాలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఎం. శాంతారామ్. పనబాక లక్ష్మీ, ఎస్.నరేష్ కుమార్ హాజరయ్యారు. నన్నపనేని సదాశివరావు వర్చువల్ ద్వారా, జేఈవో వి. వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ ఎస్ఏవో ఓ బాలాజీ, సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ శ్రీ మనోహరం, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.