ఒంగోలు ఎయిర్పోర్ట్కు డీపీఆర్ పనులు ప్రారంభం.. ఈ గ్రామాల్లో భూ సర్వే
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు డీపీఆర్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఒంగోలు విమానాశ్రయం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం అవుతోంది. కోల్కతాకు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ బృందం, ఒంగోలు-కొత్తపట్నం రహదారిలోని అల్లూరు, ఆలూరు గ్రామాలలో భూ సర్వేతో సహా ప్రాథమిక పనులను ప్రారంభించింది. సోమవారం ఒంగోలుకు చేరుకున్న ఏజెన్సీ బృందం అల్లూరు, ఆలూరు గ్రామాలను సందర్శించి అక్కడ ప్రతిపాదిత విమానాశ్రయ భూములను పరిశీలించి, భూ సర్వే నిర్వహించింది.

అల్లూరు గ్రామ సచివాలయంలో స్థానిక నివాసితులు, రైతులతో కూడా ఈ బృందం మాట్లాడింది. అంతేకాకుండా ఒంగోలు విమానాశ్రయ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సేకరించిన భూమి వివరాలు, తదుపరి సేకరణ అవకాశాల గురించి చర్చించడానికి వారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించి మాట్లాడారు.
కొత్తపట్నం సమీపంలో అల్లూరు, ఆలూరు గ్రామాల చుట్టూ దాదాపు 1,086 ఎకరాలను ఉపయోగించుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. ఒంగోలు విమానాశ్రయ అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADC)కి అప్పగించింది. ప్రాథమిక క్షేత్ర స్థాయి సాధ్యాసాధ్యాల సర్వే తర్వాత, అధికారులు డీపీఆర్ తయారీ కోసం ప్రైవేట్ ఏజెన్సీని నియమించారు.
పరమిత రాయ్, అనిందిత రాయ్, భట్టాచార్యలతో కూడిన ప్రస్తుత బృందం డీపీఆర్ ప్రక్రియను ప్రారంభించడానికి అవసరమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించడానికి వచ్చింది. డీపీఆర్ సిద్ధం అయిన తర్వాత టెండర్లు, పనులు దిశగా అడుగులు పడనున్నాయి.
డీపీఆర్ రూపకల్పన పనులు చేపట్టిన టీమ్ కొత్తపట్నం సమీపంలో జీపీఎస్ ఆధారిత సర్వే కూడా చేశారు. అన్నింటికీ అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ బృందం విమానాశ్రయం ఏర్పాటుపై నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. నివేదిక వెళ్లిన తర్వాత దాని ఆధారంగానే విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన పనులు ఉంటాయి.
తాజాగా సర్వే చేసిన గ్రామాల్లో ఎంత ప్రభుత్వం భూమి ఉంది, ప్రైవేట్ భూమి ఎంత అనే వివరాలను అధికారులు చూస్తున్నారు. ఈ నివేదిక పూర్తయిన తర్వాత అవసరమైన భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


