వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీలో డ్రోన్ టెక్నాలజీపై విద్యార్థులకు ప్రత్యేక ట్రైనింగ్!

విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కీలక అడుగువేసింది. ఈ యూనివర్సిటీ పరిధిలోని వెంకటరామన్నగూడెం ఉద్యానవన కళాశాల డ్రోన్ టెక్నాలజీపై ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published on: Jun 15, 2026, 20:41:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా సరికొత్త అడుగు పడింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ కాలేజీలో 'డ్రోన్ టెక్నాలజీ'పై ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

డ్రోన్ టెక్నాలజీపై ట్రైనింగ్
డ్రోన్ టెక్నాలజీపై ట్రైనింగ్

ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ కె. ధనంజయ రావు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయం, ఉద్యానవన రంగంలో డ్రోన్ ఆధారిత సాంకేతికతకు రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోందని నొక్కి చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పంటల పర్యవేక్షణ, ప్రెసిషన్ ఫార్మింగ్, ల్యాండ్ మ్యాపింగ్, పరిశోధన కార్యకలాపాలు, సమర్థవంతమైన ఫారమ్ మేనేజ్‌మెంట్ కోసం మానవరహిత వైమానిక వాహనాలు(UAVs - డ్రోన్లు) ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు.

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి డిజిటల్ వ్యవసాయం వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ విద్యార్థులకు పలు రకాలుగా ఉపయోగపడనుంది. కేవలం డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా, చేతిలో డ్రోన్ పైలట్ లైసెన్స్ లేదా డ్రోన్ టెక్నాలజీపై పట్టు ఉన్న అగ్రి/హార్టికల్చర్ విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీలలో, అగ్రి-టెక్ స్టార్టప్‌లలో భారీ డిమాండ్ ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు స్వయంగా 'అగ్రి-ప్రెన్యూర్స్' (ఉపాధి కల్పించే స్థాయికి) గా ఎదగవచ్చు.

శిక్షణ ద్వారా విద్యార్థులు డ్రోన్లను ఉపయోగించి. ఎకరా పొలంలో ఏ ప్రాంతంలో తెగుళ్లు ఉన్నాయో కచ్చితంగా గుర్తించవచ్చు. తక్కువ నీరు, తక్కువ పురుగుమందులతో ఎక్కువ విస్తీర్ణంలో సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. మట్టిలోని తేమ శాతం, పంట దిగుబడి అంచనాలను సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కించడం నేర్చుకుంటారు.

తోటల పెంపకంలో చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల వాటిపై పురుగుమందుల పిచికారీ చేయడం రైతులకు పెద్ద సవాలుగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో కొబ్బరి, మామిడి, ఆయిల్ పామ్ వంటి తోటలలో కేవలం కొన్ని నిమిషాల్లోనే శ్రమ లేకుండా పిచికారీ పూర్తి చేయవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గిస్తుంది.

వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యాన రంగంలో సాంకేతిక విప్లవం రానుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ అధ్యాపకులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More