చేతిలో క్యాష్ లేకున్నా తిరుమల లడ్డూలు పొందవచ్చు.. టీటీడీ మరో ఆలోచన
తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్న్యూస్. తిరుమల లడ్డూలు పొందడానికి టీటీడీ మరో ఆలోచన చేస్తోంది. లడ్డూ కౌంటర్ల దగ్గర యూపీఐ పేమెంట్ ఆప్షన్ తీసుకువచ్చేందుకు పరిశీలన చేస్తోంది.
తిరుమలకు వచ్చారంటే.. లడ్డూలు తీసుకోకుండా ఏ ఒక్క భక్తుడూ వెళ్లడు. తిరుమల లడ్డూలు దేశవ్యాప్తంగా ఫేమస్. శ్రీవారి ప్రసాదం రుచిలో కూడా అమోఘం. అయితే లడ్డూల కోసం క్యూలైన్లలో నిలుచున్నప్పుడ్డు చేతిలో డబ్బులు పట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో టీటీడీ మరో ఆలోచన చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతీ కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించేందుకు ప్రణాళికలు వేస్తోంది.

తిరుమలలో ప్రతీ ఏడాది లడ్డూ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. కౌంటర్ వద్ద డబ్బులు లేవని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భక్తులు పడుతున్న ఇబ్బందులు చూసిన టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రాల్లో యూపీఐ పేమెంట్కు అవకాశం కల్పించాలని చూస్తోంది. దీంతో కౌంటర్ల వద్ద భక్తులు నగదు చెల్లించి.. లడ్డూలు పొందే ఇబ్బంది తప్పుతుంది. చాలా మంది ఇప్పుడు పేమెంట్స్ ఎక్కువగా యూపీఐ ద్వారానే చేస్తున్నారు.
ఇప్పటికే లడ్డూ విక్రయ కేంద్రంలో కియోస్క్ యంత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిద్వారా కావాల్సిన లడ్డూల సంఖ్య ఎంపిక చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే వచ్చే రశీదు ఆధారంగా కౌంటర్లో లడ్డూలు తీసుకోవచ్చు. అయితే చాలామంది యూపీఐ పేమెంట్స్ చేస్తుండటంతో యంత్రాల వద్ద రద్దీ అధికం అవుతుంది. అంతేకాదు చాలావరకు యంత్రాలు సౌంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటి సమయంలో చాలామంది భక్తులు.. యంత్రాల వద్ద ఉండటం కంటే డబ్బులతో క్యూలైన్ల వద్ద నిలుచునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. అయితే చేతిలో డబ్బులు లేనివారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అక్కడకు వచ్చిన ఇతర భక్తుల దగ్గరకు వెళ్లి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తాం.. చేతికి క్యాష్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్న ఘటనలు చూడవచ్చు.
ఇక భక్తులు ఎలాంటి సమస్యలూ లేకుండా.. లడ్డూ కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. దీనిద్వారా భక్తుల చేతిలో డబ్బులు లేకపోయినా తిరుమల లడ్డూ తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ చేసి శ్రీవారి లడ్డూలను అందుకోవచ్చు. ఈ పద్ధతితో కియోస్క్ యంత్రాల దగ్గర నిల్చోవల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు నేరుగా కౌంటర్లోనే లడ్డూ పొందవచ్చు. ఈ సర్వీస్ ఇచ్చేందుకు ఒక బ్యాంకు కూడా ముందుకు వచ్చినట్టుగా చర్చ నడుస్తోంది. మెుదట ప్రయోగత్మకంగా కొన్ని లడ్డూ కౌంటర్లలో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత భక్తుల ఫీడ్ బ్యాక్, ఫలితాల ఆధారంగా అన్ని కౌంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఆలోచనలు చేస్తోంది.

E-Paper












