గుంటూరులో ఉద్రిక్తత..! మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి - తీవ్రంగా ఖండించిన జగన్

మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లోని ఫర్నీచర్ తో పాటు కారును ధ్వంసం చేశారు. చంద్రబాబుపై అసభ్యకరమైన రీతిలో అంబటి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ… టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మరోవైపు అంబటి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు.

Published on: Jan 31, 2026, 22:09:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ నిప్పులు రాజేశాయి. తమ అధినాయకుడైన చంద్రబాబుపై అసభ్యకరమైన వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే తాను చంద్రబాబును ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదని… తనపై దాడికి దిగిన వారిని ఉద్దేశిస్తూ మాత్రమే కొన్ని వ్యాఖ్యలు చేశానని అంబటి చెబుతున్నారు.

మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి
మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి

చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తింది. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ వభారత్‌ నగర్‌లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఇంట్లోకి దూసుకెళ్లారు. ఇంట్లోని కారుతో పాటు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు, పూలకుండీలు పగలగొట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు… చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

హైకోర్టులో అంబటి భార్య పిటిషన్

ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు భార్య హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ప్రస్తావించారు. 24 గంటలపాటు తమకు భద్రత కల్పించాలని కోరారు. తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

ఖండించిన జగన్

మాజీ మంత్రి అంబటి ఇంటిపై జరిగిన దాడిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.

“తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్‌రాజ్‌’’గా మారిపోయింది కదా. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు” అని జగన్ ఫైర్ అయ్యారు.

“మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబుగారూ మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం”అని జగన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

“వరుసగా మా పార్టీ సీనియర్‌ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.అలాగే వైయస్సార్‌సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు” అని జగన్ ప్రకటించారు.

టీడీపీ నేతలు సీరియస్

మరోవైపు అంబటి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రి అనిత స్పందిస్తూ… “అంబటి దిగజారి మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం సరికాదు. శాంతిభద్రతను భగ్నం చేయాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ భాషను అంగీకరించరు” అని చెప్పారు.

కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని స్పందిస్తూ… “అంబటిని ఇప్పటివరకు సహనంతో భరించాం. ఈరోజు నుంచి అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తాం. 24 గంటల్లో మా రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుస్తుంది. బరితెగించి మాట్లాడేవారు.. భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. చట్టబద్ధంగా వెళ్తే ఏం జరుగుతుందో అంబటి రాంబాబుకు తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు.

అంబటి అరెస్ట్….!

సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి… సీఎంతో పాటు టీడీపీ శ్రేణులపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. వైద్య పరీక్షల పూర్తి తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More