Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పని చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన…. హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కావూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5సార్లు లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నుండి 3 సార్లు, ఏలూరు నుండి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కావూరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ.. ప్రగతి ప్రగతి కన్స్ట్రక్షన్స్ స్థాపించారు. ఇందులో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు దూరం అవుతూ వచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం బలంగా గళం విప్పిన నేతల్లో కావూరి ఒకరు.
కావూరిది ప్రత్యేత ముద్ర - సీఎం చంద్రబాబు
“సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారి మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు గారి మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి గారిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వట్ చేశారు.
కావూరి మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కేంద్ర మాజీమంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. కావూరి గారి సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను” అని తన పోస్టులో పేర్కొన్నారు.
తీరనిలోటు - వైఎస్ షర్మిల
“మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు గారి మరణం బాధాకరం. రాష్ట్ర రాజకీయాలకు కావూరి గారి మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసున్నా. 5 సార్లు ఎంపీ గా, UPA ప్రభుత్వంలో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి గారి సేవలు అనిర్వచనీయం” అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు.
కావూరి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏపీ, తెలంగాణలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ…. పోస్టులు చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

