ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన..

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో కీలక అడుగు పడింది. స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు.

Published on: Mar 23, 2026, 17:08:14 IST
By , Anakapalle
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రులతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు భూమి పూజ జరిగింది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటు కానుంది. లక్ష మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

గ్రీన్‌ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో సాకారం కానుందని ప్రభుత్వం చెబుతోంది. అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ వస్తుంది. దీంతో మరో 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్‌ మారనుంది.

జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్‌ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.

మొదటి దశలో 2600 ఎకరాల్లో రూ.80 వేల కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు వేశారు.

ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్ మాట్లాడారు. ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం స్పష్టంగా కనిపించిందన్నారు. స్పష్టమైన విధానాలు ఉంటే ఎంత వేగంగా పనులు సాకారం అవుతాయో ఏపీ నిరూపించిందని ప్రశంసించారు.

'పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులకు ఏపీపై ఉన్న నమ్మకానికి ఈ పరిశ్రమ అతిపెద్ద ఉదాహరణ. ఈ పరిశ్రమ ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి, రైతులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. విశాఖలోని ప్లాంట్ నుంచి ముడి ఇనుము ఖనిజ సరఫరా పైప్ లైన్ అనకాపల్లి వరకూ విస్తరిస్తాం. ఇక్కడ తయారైన ఉక్కు ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తాం. దేశీయ అవసరాలకు సరఫరా చేస్తాం. జాతీయ ఉక్కు విధానంలో భాగంగా జాతీయ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ప్లాంట్ కీలకమవుతుంది.' అని ఆదిత్య మిత్తల్ అన్నారు.

ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మాత్రమే కాదు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం, నమ్మకానికి ఇదొక ఉదాహరణ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 2019 కంటే ముందు ఆదిత్య మిత్తల్‌ను కలిసి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరినట్టుగా చెప్పారు. 2024లో ఏపీలో మళ్లీ కూటమికి పట్టం కట్టారని, అప్పటి నుంచే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ మొదలైందన్నారు.

కేవలం 30 నిముషాల జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏపీకి వచ్చిందని లోకేశ్ చెప్పారు. 'రాష్ట్రంలో 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. చాలా మంది ప్రజల్ని కలిశాను. వారి ఆకాంక్షల్ని తెలుసుకున్నాను. అందుకే రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించుకున్నాం. ఆ హామీని నెరవేర్చటంలో భాగంగా ఇవాల్టి శంకుస్థాపన మరో మైలు రాయి అవుతుంది. ఇప్పటికే పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలకు పోటీగా మేం వెళ్లటం లేదు. కానీ ఏపీకి కూడా పరిశ్రమల్ని ఆకర్షించగల సత్తా ఉందని నిరూపిస్తున్నాం. ప్రపంచ స్టీల్ పటంలో అనకాపల్లికి కూడా స్థానం దక్కింది. ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అనుసరించాం.' అని లోకేశ్ చెప్పుకొచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More