అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. అమిత్ షాతో భేటీలో చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంమంత్రిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జీ-రామ్-జీ స్కీం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Published on: Jan 08, 2026 5:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని చెప్పారు. అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని.. ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యల గురించి అమిత్ షాకు వివరించారు చంద్రబాబు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలపై చర్చించుకున్నారు.

అమిత్ షాతో సమావేశానికి ముందు చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఎల్‌జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శ్రీసిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురగోతి గురించి ముఖ్యమంత్రికి తెలిపారు.