గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) నగరంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడానికి అత్యవసర చర్యలు చేపట్టింది. పౌరులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరవాసులకు త్వరితగతిన, సులభంగా వాటర్ ట్యాంకర్లను అందించేందుకు నీటి సరఫరా విభాగం డయల్-ఎ-ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సేవలకు మొదటి రోజే విశేష స్పందన లభించిందని, సాయంత్రం 7 గంటల సమయానికి కార్పొరేషన్ సిటీ ఆపరేషన్స్ సెంటర్లో సుమారు 245 బుకింగ్లు నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు. నీటి అవసరం ఉన్నవారికి సకాలంలో ట్యాంకర్లు అందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రజలు జీవీఎంసీ సిటిజన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నీటి ట్యాంకర్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేసి, బుకింగ్ రిఫరెన్స్ నంబర్ను పొందవచ్చని, జీవీఎంసీ ఆఫీసులకు వెళ్లకుండానే స్టేటస్ను ట్రాక్ చేయవచ్చని వివరించారు.
పారదర్శకతను కాపాడేందుకు ఫస్ట్-ఇన్, ఫస్ట్-ఔట్ విధానంలో మాత్రమే బుకింగ్లను ప్రాసెస్ చేస్తామని కేతన్ గర్గ్ స్పష్టం చేశారు. నీటి సరఫరాను సమర్థవంతంగా అమలు చేయడానికి 11 ప్రాధాన్యత ప్రాంతాలలో నిరంతర పర్యవేక్షణ కోసం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లను రంగంలోకి దించారు.
సిటీ ఆపరేషన్స్ సెంటర్ శాస్త్రీయ మ్యాపింగ్ విధానం ద్వారా నీరు నింపే పాయింట్లు, సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గురిస్తారు. దీనివల్ల ట్యాంకర్ల రవాణా వేగవంతమై త్వరగా నీరు అందుతుంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపిన కమిషనర్, ప్రజలు నీటిని పొదుపుగా వాడుతూ అధికారులకు సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0009 లేదా ల్యాండ్లైన్ నంబర్ 0891-2762876కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.
{{/usCountry}}జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0009 లేదా ల్యాండ్లైన్ నంబర్ 0891-2762876కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.
{{/usCountry}}మరోవైపు విశాఖపట్నం నగరవ్యాప్తంగా అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నీటి ట్యాంకర్ యజమానులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అన్యాయమైన ధరలు వసూలు చేస్తున్నారు. జలాశయాలు, భూగర్భ జలాల మట్టాలు తగ్గడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లోని బోర్వెల్లు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పైపుల ద్వారా నీటి సరఫరా రెండు మూడు రోజులకు ఒకసారికి తగ్గిపోయింది. దీంతో నివాసితులు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడవలసి వస్తోంది. జీవీఎంసీ తీసుకొచ్చిన డయల్ ఎ ట్యాంకర్ సర్వీసుతో నగరవాసులకు ఉపశమనం దొరకనుంది.