ఏపీలో ఎండలు పెరుగుతున్నాయి…! చలి తీవ్రత తగ్గిపోగా… క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల ప్రారంభంపై ఏపీ సర్కార్ ఫోకస్ నిర్ణయం తీసుకుంది.
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు…!

మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వలు వెలువడనున్నాయి.
ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులు నిర్వహిస్తారు. 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు జరుగుతాయి.
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పలు ప్రభుత్వ పాఠశాలలను కూడా టెన్త్ ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో మాత్రం… ఒంటిపూట బడుల నిర్వహణ మధ్యాహ్నం నుంచి ఉంటుంది. టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. మిగతా స్కూళ్లలో మాదిరిగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం బడులు తెరిచి ఉంచుతారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్(ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20)
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు