కార్పొరేట్ వైద్యం మీ నియోజకవర్గంలోనే.. పీపీపీ మోడల్లో 61 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు!
పీపీపీ మోడల్లో 61 నియోజకవర్గాల్లో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
సంకీర్ణ ప్రభుత్వానికి ప్రతి ప్రాణం విలువైనదేనని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ముఖ్యంగా 50 పడకల కంటే తక్కువ వైద్య సౌకర్యాలు ఉన్న నియోజకవర్గాలలో ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోందని అన్నారు.

మెుదటి దశలో 61
'మొదటి దశలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP) పద్ధతిలో 61 నియోజకవర్గాలలో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం. అవసరమైన చోట, క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.' అని సత్యకుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెకండరీ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి దాదాపు 40 ప్రతిపాదనలు వచ్చాయని సభకు తెలియజేశారు. వీటిలో విజయవాడ శివార్లలోని గన్నవరం, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు ఉన్నాయి. మంగళగిరి, పిఠాపురంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను 100 పడకలకు అప్గ్రేడ్ చేయడానికి, చింతూరులోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల సౌకర్యంగా విస్తరించడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా వెల్లడించారు.
పనులు వేగవంతం
2014-19లో టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 81 ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినప్పటికీ, గత ప్రభుత్వం 2019-2024 మధ్య నిర్మాణ పనులను పూర్తి చేయలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆళ్లగడ్డలోని 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేయడంతో సహా పెండింగ్లో ఉన్న ఈ పనులను సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు వేగవంతం చేసిందని ఆయన అన్నారు.
నాబార్డు మద్దతుతో
నాబార్డ్ మద్దతుతో రూ.1,518.80 కోట్ల వ్యయంతో 188 ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సిలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని సత్యకుమార్ తెలిపారు. ఇందులో రూ.111 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, 60 ఆసుపత్రి భవనాలు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు.
జిల్లాకో క్రిటికల్ కేర్ బ్లాక్
ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 24 క్రిటికల్ కేర్ బ్లాక్ భవనాలు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. వీటిలో 14 పూర్తి దశల్లో ఉన్నాయి. చిత్తూరు, అమలాపురం, అన్నమయ్య, పోలవరం జిల్లాల్లో అదనపు క్రిటికల్ కేర్ బ్లాక్ల కోసం రాష్ట్రం కేంద్ర అనుమతిని కోరింది. ప్రతి 100 కి.మీ. రహదారులకు ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే ఇటీవలి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనను సత్యకుమార్ యాదవ్ ప్రస్తావిస్తూ, ప్రమాద సంబంధిత మరణాలను నివారించడానికి తగిన ప్రదేశాలలో ట్రామా సెంటర్లను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలోని రుద్రపాక గ్రామంలో కొత్త ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనం నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలియజేశారు. రూ.1.94 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో, ఇప్పటివరకు రూ.54 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయని అన్నారు.

E-Paper












