విశాఖ పోర్ట్ కోసం హెచ్ఎస్ఎల్ రెండో టగ్ నౌక నిర్మాణానికి శ్రీకారం!
విశాఖపట్నం పోర్టు అథారిటీ కోసం హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న రెండో 60 టన్నుల బొల్లార్డ్ పుల్ టగ్ (VC 11206) నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రెండో టగ్కు కీల్ లేయింగ్ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్(HSL) మరో కీలక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(VPA) కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న 60 టన్నుల బోలార్డ్ పుల్ టగ్ నౌక 'VC 11206' నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన కీలకమైన కీల్ లేయింగ్ కార్యక్రమాన్ని వీపీఏ ఛైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

గతేడాది డిసెంబర్లో ఈ టగ్ నౌకల తయారీ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో స్టీల్ కటింగ్ నిర్వహించి, ప్రస్తుతం అనుకున్న సమయానికి కీల్ లేయింగ్ పూర్తి చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా నిర్మిస్తున్న మొదటి టగ్ నౌక తయారీ ఇప్పటికే 60 శాతం పూర్తికాగా, రెండో దాన్ని కూడా అంతే వేగంగా పూర్తిచేసి రాబోయే అక్టోబరు మాసంలో రెండింటినీ ఒకేసారి నీటిలోకి ప్రవేశపెట్టనున్నారు.
1970లో వీపీఏ కోసం నిర్మించిన లాంచ్ శాంతి అనే నౌక నుంచి ఇప్పటివరకు హెచ్ఎస్ఎల్ విశాఖ పోర్ట్ కోసం తయారుచేస్తున్న 13వ నౌక ఇది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. భారీ సరకు రవాణా నౌకలు పోర్ట్లోకి వచ్చినప్పుడు, వాటిని సురక్షితంగా ఒడ్డుకు(బెర్త్కు) తీసుకురావడానికి లేదా వెనక్కి తోయడానికి ఈ టగ్ నౌకలను ఉపయోగిస్తారు.
60 టన్నుల లాగుడు సామర్థ్యం(Bollard Pull) ఉన్న ఈ ఆధునిక టగ్ నౌకల వల్ల నౌకాశ్రయంలోకి వచ్చే ఓడల నిలిపివేత వేగంగా పూర్తవుతుంది. నౌకలు పోర్ట్లో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించి పోర్ట్ సమర్థతను పెంచుతాయి. ప్రతికూల వాతావరణంలో కూడా భారీ నౌకలను సురక్షితంగా లాగడానికి ఇవి సహాయపడతాయి.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఛైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా మాట్లాడుతూ.. "విశాఖపట్నం నగరానికి హెచ్ఎస్ఎల్, వీపీఏలు రెండు వారసత్వ చిహ్నాలు. 90 ఏళ్లకు పైగా దేశ సేవలో నిమగ్నమైన ఈ రెండు సంస్థలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పిలుపునకు అనుగుణంగా పనిచేస్తున్నాయి.' అని కొనియాడారు.
హెచ్ఎస్ఎల్ సీఎండీ రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) చంద్రశేఖరన్ రఘురామ్ మాట్లాడుతూ.. వీపీఏతో రాబోయే రోజుల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. 60 టన్నుల ఎలక్ట్రిక్ టగ్ తయారీ, గ్రీన్ ఫ్లీట్గా మార్చే ప్రక్రియ, హెచ్ఎస్ఎల్ డ్రై డాక్ను ఉపయోగించుకుని దీర్ఘకాలిక నౌకల మరమ్మతు ఒప్పందంపై ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో దుగరాజపట్నం వద్ద నూతన షిప్బిల్డింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు ఆలోచన ఉందని రఘురామ్ వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


