రాష్ట్రంలో చలి తీత్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...నైరుతి బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడనం ఇవాళ బలహీనపడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతోలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదిలే అవకాశం ఉంది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తువ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది కొనసాగుతుండగా.... ఈ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఇదే ప్రాంతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
ఏపీకి వర్ష సూచన...
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరం లేదా పలుచోట్ల పొగమంచు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
ఇక రాయలసీమలో చూస్తే... ఇవాళ పొడి వాతావరం ఉంటుంది. రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్లో, ఆరెంజ్, రెడ్ వంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది
ఇవాళ రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 3 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదు. కోస్తాంధ్రలో రాగల 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.