...
...
Next Story

IRCTC Pilgrimage Tourism : తెలుగువారి కోసం ఐఆర్‌సీటీసీ 4 తీర్థయాత్ర ప్యాకేజీలు.. సమ్మర్‌లో ఏ తేదీల్లో ఉన్నాయ్!

IRCTC Pilgrimage Tourism Packages : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీగుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్యాకేజీలను ప్రకటించింది. ఇవి సమ్మర్ హాలీడేస్‌ దగ్గరలోనే ఉన్నాయి.

Published on: Apr 12, 2026, 14:11:15 IST
Advertisement

బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మధ్యతరగతివారు కూడా ఈ ప్యాకేజీల్లో టూర్లు తిరిగిరావొచ్చు. దేశంలో ముఖ్యమైన ప్రదేశాలకు ఈ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే తీర్థయాత్ర పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం నాలుగు ప్రత్యేక 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' ప్యాకేజీలను ప్రకటించింది.

ఐఆర్‌సీటీసీ తీర్థయాత్ర ప్యాకేజీలు
ఐఆర్‌సీటీసీ తీర్థయాత్ర ప్యాకేజీలు

ఈ రైళ్లు ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ నుండి నడవనున్నాయి. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడిస్తూ.. జాయింట్ జనరల్ మేనేజర్ (టూరిజం) డి.ఎస్.జీ.పీ.కిషోర్ మాట్లాడారు. భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులకు ఒక సమగ్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

మొదటి ప్యాకేజీ అయిన అయోధ్య–కాశీ: బైద్యనాథ్ ధామ్ దర్శన యాత్ర(SCZBG56) ఏప్రిల్ 28 నుండి మే 7 వరకు కొనసాగుతుంది. ఇది పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ క్షేత్రాలను కవర్ చేస్తుంది.

దీని తర్వాత మే 12 నుండి మే 21 వరకు 'హరిద్వార్–మాతా వైష్ణో దేవి–ఋషికేశ్ యాత్ర' (SCZBG57) ఉంటుంది. ఇది మధుర, బృందావనం, వైష్ణో దేవి, హరిద్వార్, ఋషికేశ్ క్షేత్రాలను కనెక్ట్ చేస్తుంది.

మూడో ప్యాకేజీ అయిన 'అరుణాచలం–చిదంబరం దివ్య దక్షిణ యాత్ర' (SCZBG58), మే 24 నుండి మే 31 వరకు షెడ్యూల్ చేశారు. ఇది రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తంజావూరు వంటి కీలకమైన దక్షిణ భారత తీర్థయాత్ర కేంద్రాలను కవర్ చేస్తుంది.

ప్రయాణ తరగతిని బట్టి టికెట్ ధరలు రూ.14,500 నుండి రూ.34,100 మధ్య ఉంటాయి. ఈ ప్యాకేజీలలో రైలు, రోడ్డు రవాణా, వసతి, భోజనం, గైడ్ సహాయంతో సందర్శనలు, బీమా సదుపాయాలు కూడా కలిసి ఉండనున్నాయి. రైలులో భద్రతా సిబ్బంది, సీసీటీవీ నిఘా ఏర్పాట్లు కూడా కల్పించారు.

పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ అధికారిక వెబ్‌సైట్ వెళ్లొచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe