జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్లోని తన సొంత నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు.
పవన్ కల్యాణ్ ట్వీట్…

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రెస్ మీట్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసుల అనుమతిపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఈ రోజు సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్లోని నా నివాసంలో మీడియా సమావేశం ఉంటుంది. జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ కనీసం ఇప్పుడైనా అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం,…" అని తన పోస్టులో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గతంలో జనసేన కార్యక్రమాలకు, పర్యటనలకు అనుమతుల విషయంలో తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నిజానికి జూన్ 2 సందర్భంగా హైదరాబాద్ లో జనసేన ఆధ్వర్యంలో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ నిర్వహించాలనుకున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.