...
...
Next Story

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు జనసేన డిమాండ్

తిరుమల లడ్డూ వివాదంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు జనసేన డిమాండ్ చేసింది. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో నెయ్యి సృష్టించారని జనసేన పార్టీ మరోసారి ఆరోపణలు చేసింది. ఆ సింథటిక్ నెయ్యి తిరుమలకు సరఫరా చేశారని తెలిపింది.

Published on: Feb 03, 2026 11:36 AM IST
Advertisement

వైఎస్సార్‌సీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతువుల కొవ్వు నుంచి తయారైన రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారని జనసేన సర్వసభ్య సమావేశం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో అధ్యక్షత వహించిన పార్టీ సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో, సీబీఐ నేతృత్వంలోని సిట్ తన ఛార్జ్ షీట్‌లో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని చెప్పలేదని పార్టీ పేర్కొంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్

'తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడినప్పటికీ తమకు క్లీన్ చిట్ ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. కల్తీ నెయ్యి కొనుగోలు, సరఫరాకు ద్వారాలు తెరిచి రూ. 233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకుంది వైఎస్ఆర్సీపీనే. ఆలయానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన వారే అనైతిక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. వైఎస్ఆర్సీపీ పాలనలో నువ్వుల నూనె కంటే తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేశారు. దానిలోని ప్రతి చుక్క కల్తీ అయింది. ఆవు పాలు, వెన్న లేకుండా నెయ్యిని సృష్టించడం శాస్త్రవేత్తలకు కూడా సాధ్యం కాదు. వైఎస్ఆర్సీపీ మాత్రమే దీన్ని చేయగలదు.' అని జనసేన పేర్కొంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందనేది 100 శాతం నిజమని జనసేన స్పష్టం చేసింది. రసాయనాలతో తయారు చేసిన పదార్థాన్ని నెయ్యిగా సమర్పించి, దానితో 20 కోట్ల లడ్డూలను తయారు చేసి ప్రసాదంగా విక్రయించారని పార్టీ ఆరోపించింది. ఈ కఠినమైన వాస్తవాలను సీబీఐ నివేదిక స్పష్టంగా పేర్కొందని తెలిపింది.

NDDB ఇచ్చిన నివేదిక ఆధారంగా.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ విషయాన్ని తదుపరి అసెంబ్లీ సమావేశంలో వివరంగా చర్చించాలని జనసేన పార్టీ పేర్కొంది.

తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని తెలియగానే ప్రతి ఒక్క భక్తుడూ మనో వేదనకు లోనయ్యాడని జనసేన తెలిపింది. స్వామివారి ఆలయానికి ధర్మకర్తలుగా ఉండాల్సినవాళ్ళు నీతిబాహ్యమైన చర్యలకు ఒడిగట్టడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. తిరుమల వేంకటేశ్వర స్వామి కొండపై అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై చర్చించే సమయం ఆసన్నమైనది. తిరుమల లడ్డూ తయారీకి అవసరమైన ఆవు నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు కలిపి అపచారానికి పాల్పడ్డ వైసీపీ నీచత్వాన్ని నెయ్యి కుంభకోణంలో రూ.233 కోట్లు దోచేయడాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేసేలా శాసన సభలో చర్చించాలి. ప్రజలకు తెలియజేసేందుకు జనసేన సన్నద్ధం కావాలని తీర్మానిస్తున్నాం.' అని జనసేన తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe