...
...
Next Story

డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం - ఈ సేవలు రద్దు

డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సహస్రదీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

Published on: Nov 30, 2025, 06:58:45 IST
Advertisement

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను పేర్కొంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.

శ్రీవారికి హారతి…

తిరుమల
తిరుమల

ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

పలు సేవలు రద్దు…

అంతేకాకుండా యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ కారణంగా డిసెంబర్ 4వ తేదీ సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

డిసెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల జాబితా:

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి….

• డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.

• డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.

• డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.

• డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.

• డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.

• డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.

• డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe