అసైన్డ్‌ ల్యాండ్స్‌పై కీలక నిర్ణయం.. 22ఏ నుంచి మాజీ సైనికుల భూముల తొలగింపు

22ఏ నుంచి మాజీ సైనికుల భూముల తొలగిస్తున్నట్టుగా సీఎం చంద్రబాబు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated on: Aug 10, 2026, 19:13:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మొదట స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ 22ఏ బాధితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ భూ, రెవెన్యూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు
మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు

మాజీ సైనికులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం తమకు ప్రభుత్వం అందించిన భూములు 22ఏ జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను విన్న సీఎం చంద్రబాబు.. సంబంధిత భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదే విధంగా డీ నోటిఫికేషన్‌ ప్రక్రియను సులభతరం చేసేలా ఆర్డీఓకు అధికారాలను కల్పించాలని సూచించారు.

అలాగే అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా వర్గీకరించే ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తమ భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను ముఖ్యమంత్రికి లబ్ధిదారులు వివరించారు. గతంలో ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా తమ భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భాస్కరరావుపేట, వైవాక, గురవయ్యపాలెం, ఉనికిలి, కలిదిండి గ్రామస్తులతో సీఎం మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో అధికారులు ఉనికిలి, కలిదిండి, వైవాకలోని 830 గ్రామాలకు సంబంధించి 2,745 ఎకరాలను రిజిస్ట్రేషన్‌కు విముక్తి కలిగించారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 4,977 ఎకరాలు 22ఏ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ప్రక్రియ అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారులకు 1బి అడంగల్ ప్రతులను అందజేశారు. భూ సమస్యలను స్వయంగా విని, సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి సమస్య పరిష్కరించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More