AP Local Elections : చివరి దశకు బీసీ జనాభా లెక్కింపు - త్వరలోనే స్థానిక ఎన్నికలు..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దిశ కసరత్తు జరుగుతోంది. బీసీ జనాభా లెక్కింపు చివరి దశకు చేరటంతో… సాధ్యమైనంత త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

Published on: Apr 08, 2026 9:56 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. 13,100 పంచాయతీల్లోని పాలకమండలి పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మరో 250 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర కారణాలతో అప్పట్లో ఎన్నికలు జరగలేదు.

త్వరలోనే స్థానిక ఎన్నికలు...!
త్వరలోనే స్థానిక ఎన్నికలు...!

సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు నియమితులయ్యారు. తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేకాధికారులుగా ఎమ్మార్వోలు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో), మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారుల(ఈవో) సేవలు అందించనున్నారు.

సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు…!

స్థానిక ఎన్నికలు నిర్వహణతో పాటు బీసీ జనగణన, వర్గీకరణ వంటి అంశాలపై గతేడాది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగగా…. ఎన్నికల నిర్వహణపై ఏజీ వివరణ ఇచ్చిందారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు.

రాష్ట్ర ప్రణాళికశాఖ చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియ కూడా చివరి దశకు చేరిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో పది రోజుల్లో పూర్తవుతుందన్నారు. గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులు ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 16కు వాయిదా పడింది.

గ్రామ పంచాయతీల పాలకమండలి పదవీ కాలం ముగిసిన ఈసీ కూడా వేగం పెంచనుంది. ఇప్పటికే గత కొంత కాలంగా ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాలు ప్రచురితమయ్యాయి. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి…. ఎక్కడా పొరపాట్లు లేకుండా ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది.

సర్పంచ్ ఎన్నికలు రాబోతున్న వేళ గ్రామాల్లోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వాళ్లు… పావులు కదిపే పనిలో పడ్డారు. రిజర్వేషన్ల ఖరారు అయితే… పోటీపై మరింత స్పష్టతకు రానున్నారు. ఇక మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రధాన పార్టీలలో పని చేస్తున్న పలువురు నేతలు… ఇప్పట్నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More