పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ ప్రవేశాలు
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో 100 సీట్లు, బోధనాసుపత్రి సామర్ధ్యం పెంపు, సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలను కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం(సీయస్యస్) కింద రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ల కళాశాలను నిర్మించి, నిర్వహించనుంది. ఈ పథకం కింద కేంద్రం పిడుగురాళ్ల కళాశాలకు రూ.195 కోట్ల సహాయాన్ని మంజూరు చేసి రాష్ట్రానికి విడుదల చేసింది.

మొదటి దశలో 100 ప్రవేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) ప్రస్తుత నిబంధనల మేరకు 100 ఎంబీబీఎస్ ప్రవేశాలకు 420 పడకలతో కూడిన బోధనాసుపత్రిని సమకూర్చాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వం 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 330 పడకల సామర్ధ్యం కలిగిన జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. మారిన ఎన్ఎంసీ నిబంధనల మేరకు 420 పడకల ఆసుపత్రి అవసరం కాగా ఈ దిశగా ఆసుపత్రిని విస్తరించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు 237 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో పాటు బోధానాసుపత్రికి 600 మంది సిబ్బందిని సమకూర్చేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత ప్రభుత్వం నిర్మించాలనుకున్న మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మొత్తం 2,500 ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రణాళికలు రచించి, నిర్మాణాలు చేపట్టామని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం 100 ప్రవేశాలకు మాత్రమే అనుమతిస్తూ 20.8.2020న మెమో నంబరు 2980561ని జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ఇదే రీతిన పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా జగన్ ప్రభుత్వం ఎన్ఎంసీ నుండి 100 ఎంబీబీఎస్ ప్రవేశాలకు మాత్రమే అనుమతి పొందిందని మంత్రి తెలిపారు.
2023లో సవరించిన ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకునే నాటికే 150 ప్రవేశాలకు 620 పడకలతో కూడిన బోధానాసుపత్రి సిద్ధంగా ఉండాలని, మొదటి దశలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 ప్రవేశాలు కల్పించి అనంతరం అదనపు ప్రవేశాల కోసం చర్యలు చేపడతామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


