ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ - త్వరలో ఇంటి వద్దనే 41 వైద్య పరీక్షలు..!
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల్లో లబ్ధిదారుల శాతం పెరిగిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. నిర్దేశిత సమయంలోనే రోగుల వద్దకు 108 వాహనాలు చేరుకుంటున్నాయని తెలిపారు. 104 వాహనాల ద్వారా త్వరలో ఇంటి వద్దనే 41 వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో సానుకూలమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ పథకం కింద కూటమి ప్రభుత్వ పాలనలో భారీగా పెరిగిన వ్యయం మరియు లబ్దిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల అమలును, 108 మరియు 104 సేవలను శనివారంనాడు వర్చువల్ గా సంబంధిత అధికారులతో మంత్రి వివరంగా సమీక్షించారు. 108 సేవలకు సంబంధించిన టెండర్ లో కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా కఠినమైన నిబంధనలు విధించడంతో ఈ సేవలు ఎంతో మెరుగుపడ్డాయని మంత్రి వివరించారు.

“2022-24 కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 23,08,930 మంది కింద లబ్దిపొందారు. దీని ప్రకారం సగటున నెలకు 96,205 మందికి ఆరోగ్యశ్రీ సేవలందాయి. కూటమి ప్రభుత్వ పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతేడాది డిసెంబరు వరకు మొత్తం 24,49,117 లబ్దిదారులకు వైద్య సేవలందాయి. ఈమేరకు సగటున నెలకు 1,16,624 మందికి నగదు రహిత వైద్య సేవలు అందడంతో లబ్దిదారుల్లో 21 శాతం వృద్ధి నమోదైంది” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
సకాలంలోనే అంబులెన్స్ సర్వీసులు..
108 సేవల్లో సానుకూల ఫలితాలొస్తున్నాయని మంత్రికి అధికారులు వివరించారు. గతేడాది జూన్ నుంచి 108 వాహనాలు అగ్రిమెంట్లో పొందుపర్చిన నిమయ నిబంధనల మేరకు రోగులకు చేరుతున్నాయని, ముఖ్యంగా గోల్డెన్ అవర్ (108 వాహనం కోసం ఫోన్ కాల్ వచ్చినప్పట్నించి గంటలోగా రోగిని ఆసుపత్రికి చేర్చడం) విషయంలో సత్ఫలితాలొస్తున్నాయని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ కాల్ వచ్చినప్పట్నించి 18 నిమిషాల్లో 108 వాహనం రోగి వద్దకు చేరాల్సి ఉండగా ఇప్పటి వరకు సగటున కేవలం 37 సెకన్ల ఆలస్యంతో ఆ వాహనాలు రోగుల వద్దకు చేరుతున్నాయని అధికారులు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 23 నిమిషాలుగా నిర్దేశించబడగా సగటున కేవలం 13 సెకన్లు మాత్రమే ఆలస్యం అవుతోందని, గిరిజన ప్రాంతాల్లో 33 నిమిషాల్లో 108 అంబులెన్సులు రోగుల వద్దకు చేరాల్సి ఉండగా సగటున 2 నిమిషాల 34 సెకండ్లు ముందే చేరుతున్నాయని అధికారులు తెలపగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం రూపొందించిన నియమం మేరకు ప్రస్తుతం 108 వాహనాల ద్వారా 95.58 శాతం రోగులు సగటున 1 గంట 5 నిమిషాల్లో ఆసుపత్రులకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు. గతంలో ఈ నిబంధన లేనందున కేవలం 15 శాతం రోగులు సగటున 1 గంట 57 నిమిషాల్లో ఆసుపత్రులకు చేరగలిగేవారని వారు వివరించారు.
108 టెండర్… కఠిన నిబంధనలు
- 108 సర్వీసుల టెండర్ కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం కఠిన నిబంధనల్ని అమలు చేసింది. గత ప్రభుత్వం 50 కంటే తక్కువ 108 అంబులెన్సులు నడిపిన అనుభవం ఉన్నవారికి అవకాశాన్ని కల్పించగా కూటమి ప్రభుత్వం కనీసంగా 100 అంబులెన్సులు నడిపిన అనుభవం ఉండాలన్న నిబంధనను పెట్టి 800 వాహనాలను నడిపిన అనుభవం కలవారిని ప్రోత్సహించే విధంగా నిబంధనలు రూపొందించింది.
- గత టెండర్ సమయంలో గత మూడేళ్లలో ఏడాదికి అంబులెన్సులు నడపడంద్వారా రూ.25 కోట్లు ఆదాయం ఉన్నవారికి అర్హత కల్పించగా కూటమి ప్రభుత్వం దీన్ని కనీసంగా రూ.100 కోట్ల మేరకు పెంచి అంతకంటే ఎక్కువ ఆదాయం చూపిన వారికి ప్రోత్సాహకాలు కల్పించింది.
- గతంతో ఒక్కో అంబులెన్స్కు ఒక ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు డ్రైవర్ను నియమించాలని నిబంధన పెట్టగా కూటమి ప్రభుత్వం ఒక్కో అంబులెన్స్కు ఇద్దరేసి చొప్పున టెక్నీషియన్లు మరియు డ్రైవర్లు ఉండాలనే నియమం పెట్టింది.
- కూటమి ప్రభుత్వం టెలిఫోన్ కాల్ వచ్చిన గంటలోపే రోగిని 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించాలని నిబంధన పెట్టింది.
త్వరలోనే ఇంటివద్దనే 41 వైద్య పరీక్షలు - మంత్రి
104 వాహనాల ద్వారా త్వరలో ప్రతి ఒక్కరికీ 41 రకాల వైద్య పరీక్షలు చేసే ప్రక్రియను చేపడతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈమేరకు జరుగుతున్న సన్నాహకాల గురించి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, 108 మరియు 104 వాహన సేవలు ఎంతో కీలకమైనవని… వీటి అమలు, నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన సేవల్ని అందించాలని మంత్రి యాదవ్ ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

