నారావారిపల్లెలో లోకేశ్ ప్రజాదర్బార్.. తిరుమల అంగప్రదక్షణ టోకెన్స్‌పై రిక్వెస్ట్

సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో ఉన్నారు మంత్రి లోకేశ్. అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు.

Published on: Jan 14, 2026 6:49 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా బసినికొండకు చెందిన పి.శివకుమార్ కోరారు.

ప్రజాదర్బార్‌లో లోకేశ్
ప్రజాదర్బార్‌లో లోకేశ్

తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కచ్చరావేడులో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బి.శ్రీనివాసులు కోరారు. వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా బలిజపల్లికి చెందిన కె.పార్వతి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెలో ఉన్నారు. భోగి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను ముఖ్యమంత్రి కుటుంబం ఆసక్తిగా తిలకించింది. మంత్రి నారా లోకేశ్ కూడా ఇక్కడే ఉన్నారు. నాలుగు రోజులపాటు స్వగ్రామంలోనే ఉండి.. సంక్రాంతి సంబరాలు జరుపుకొంటారు.

మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రి తమ గ్రామంలో ఉండటంతో గ్రామస్థుల నుంచి అనేక వినతులు వస్తున్నాయి. వాటిని చంద్రబాబు, లోకేశ్ స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

వేగమే అభివృద్ధికి కీలకం : లోకేశ్

వేగమే అభివృద్ధికి కీలకం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అనంతపురంలో ఏసీఎంఈ గ్రూప్ ఇండియా వారి 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లస్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుపై ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించినప్పటి నుండి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావడానికి కేవలం 4 నెలల సమయం పట్టడం చూసి సంతోషిస్తున్నట్టుగా తెలిపారు. ఈ రూ.3,000 కోట్ల ప్రాజెక్టు 2026 నాటికి పూర్తి కానుందన్నారు. గ్రిడ్ విశ్వసనీయతను పెంచడంలో, భారత్ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా నిలుస్తోందన్నారు లోకేశ్.