వారంలో 500 కుక్కలను చంపేశారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసమే!

తెలంగాణలో వందల సంఖ్యలో కుక్కలను చంపడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వారంలో రెండు జిల్లాల్లో 500 కుక్కలను చంపేశారు.

Updated on: Jan 14, 2026 5:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వారం రోజుల్లో 500 కుక్కలను చంపేశారు. అయితే బయటకు రాని ఘటనలు ఇంకా ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో వీధి కుక్కల బెడద లేకుండా చేస్తామని, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీ ప్రకారమే.. ఈ ఘటనలు జరుగుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మరోవైపు వీధి కుక్కలను సామూహికంగా చంపడంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో ఏడుగురు సర్పంచ్‌లు సహా అనేక మందిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం మొదటి రెండు వారాల్లో కనీసం 500 కుక్కలను విషప్రయోగం చేసి చంపారనే నివేదికల తర్వాత జంతు హింసపై చర్చ నడుస్తోంది.

ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనేక మంది సర్పంచ్ అభ్యర్థులు జనాలకు కుక్కలు లేని గ్రామంగా చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కుక్కలను చంపడం మెుదలైంది. భవానీపేట, పాల్వంచ, ఫరీద్‌పేట గ్రామాలలో ఈ సంఘటనలు జరిగినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. మంగళవారంభవానీపేట, పాల్వంచ గ్రామ శివార్లలో సుమారు 150 కుక్కల కళేబరాలు లభించాయని అధికారులు తెలిపారు. బుధవారం ఫరీద్‌పేటలో జరిపిన తనిఖీలలో అక్కడ మరో 50 కుక్కలు చంపబడినట్లు వెల్లడైంది.

పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పశువైద్య బృందాలు కళేబరాలను వెలికితీశాయి. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి, ఉపయోగించిన విషాన్ని గుర్తించడానికి అంతర్గత అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపారు.

ఈ నెల ప్రారంభంలో హనుమకొండ జిల్లాలో శాయంపేట, ఆరేపల్లి గ్రామాలలో 300 వీధి కుక్కలను చంపిన కేసు బయటకొచ్చింది. ఆ కేసులో పోలీసులు జనవరి 9, 2026న ఇద్దరు మహిళా సర్పంచులు, వారి భర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతరులతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సుమారు 110 కుక్కల మరణాలు నిర్ధారించామని అధికారులు చెబుతున్నారు.

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మునిసిపాలిటీ నుండి ఒక భయంకరమైన వీడియో బయటకు వచ్చింది. ఒక వ్యక్తి కుక్కకు విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నట్లు కనిపించింది. ఒక నిమిషంలోనే అది కూలిపోయింది. వీధిలో మరో రెండు కుక్కల కళేబరాలు కూడా కనిపించాయి. రెండు వారాల క్రితం ఈ మునిసిపాలిటీలో కనీసం 50 కుక్కలు చంపబడినట్లు తెలుస్తోంది. ఇలా బయటకు రాని విషయాలు కూడా చాలానే ఉన్నాయి. సామూహికంగా కుక్కలను చంపేందుకు ప్రొఫెషనల్ కుక్క పట్టేవారిని నియమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.