...
...
Next Story

ఈ ఏడాది ఏపీ కేజీబీవీల్లో సరికొత్త యాక్షన్ ప్లాన్.. 590కి పైగా మార్కులే టార్గెట్!

ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(KGBV) విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రభుత్వ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘విజయపథం’ పేరుతో ఒక సమగ్ర విద్యా ప్రణాళికను రూపొందించాయి.

Published on: Jun 15, 2026 02:32 PM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో(KGBVs) విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పబ్లిక్ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఒక సమగ్ర విద్యా కార్యాచరణ ప్రణాళికను విద్యాశాఖ రూపొందించింది. ఈ ప్రతిష్టాత్మక విద్యా ప్రణాళికకు ‘విజయపథం’ అని నామకరణం చేశారు.

ఏపీ కేజీబీవీల్లో సరికొత్త ప్లాన్
ఏపీ కేజీబీవీల్లో సరికొత్త ప్లాన్

'నేర్చుకోవడమే లక్ష్యం - విజయమే గమ్యం'(Learning is the Goal - Success is the Destination) అనే బలమైన నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, 590కి పైగా మార్కులు సాధించే విద్యార్థినుల సంఖ్యను గణనీయంగా పెంచడం, రాష్ట్రవ్యాప్త ర్యాంకింగ్స్‌లో కేజీబీవీల స్థానాన్ని మెరుగుపరచడమే ఈ ‘విజయపథం’ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి కేజీబీవీ కార్యదర్శి డి. దేవానంద రెడ్డి మాట్లాడుతూ 'విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించడం, క్రమబద్ధమైన స్టడీ షెడ్యూల్స్ అమలు చేయడం, నిరంతర మూల్యాంకనం పైనే విజయపథం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.' అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 352 కేజీబీవీలలో ఈ విద్యా సంవత్సరం (2026-27) నుండి విజయపథం యాక్షన్ ప్లాన్ అమలు కానుంది.

రోజువారీ క్రమబద్ధమైన టైమ్‌టేబుల్

విద్యార్థినులపై మానసిక ఒత్తిడి పడకుండా చదువును, విరామ సమయాన్ని సమతుల్యం చేసేలా రోజువారీ షెడ్యూల్‌ను డిజైన్ చేశారు. ఇందులో భాగంగా రోజూ క్లాసులతో పాటు 5 గంటల పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రత్యేక స్టడీ అవర్స్ ఉంటాయి. ఉపాధ్యాయులు నేరుగా పర్యవేక్షించే మూడు విభిన్న స్టడీ సెషన్స్ ఇందులో భాగం కానున్నాయి.

వీక్లీ గ్రాండ్ టెస్ట్‌లు, స్లిప్ టెస్ట్‌లు

విద్యార్థినుల ప్రతిభ ఆధారంగా వారిని వీక్లీ అనాలిసిస్ ద్వారా నాలుగు విభాగాలుగా విభజించి బోధన అందిస్తారు. వెనకబడిన విద్యార్థినులపై నైట్ డ్యూటీలో ఉండే టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి అదనపు గైడెన్స్, ప్రత్యేక విద్యా మద్దతు అందిస్తారు.

ఖాళీల భర్తీ

కేజీబీవీలలో వసతితో కూడిన ఉచిత నాణ్యమైన విద్య అందుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఈ విద్యా సంస్కరణలు, కొత్తగా తీసుకొచ్చిన ‘విజయపథం’ ప్రణాళిక కేజీబీవీ విద్యార్థినులలో వ్యవస్థీకృత క్రమశిక్షణను పెంచి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అత్యుత్తమ పబ్లిక్ పరీక్షల ఫలితాలను సాధించడంలో కీలక భూమిక పోషించనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe