ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(NMC) తీపి కబురు అందించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 175 ఎంబీబీఎస్(MBBS) సీట్ల భర్తీకి ఎన్ఎమ్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 325కు చేరింది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా అనుమతుల ప్రకారం సీట్లు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఎన్ఎమ్సీ అనుమతి ఇచ్చింది. సిద్ధార్థ వైద్య కళాశాల(విజయవాడ)కు అదనంగా మరో 75 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఎన్ఎమ్సీ విడుదల చేసింది.
ఇటీవలే కడప, నెల్లూరు, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనపు సీట్లకు ఎన్ఎమ్సీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంజూరైన 175 సీట్లతో కలిపి ఈ ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 325 కొత్త ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో అదనంగా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేరుగా ఢిల్లీ వెళ్లి ఎన్ఎమ్సీ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు ఫలించడంతోనే ఈ అదనపు సీట్లు మంజూరయ్యాయని అధికారిక ప్రకటన పేర్కొంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 505 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తోడయ్యాయి. ఈ పరిణామంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పెరగడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి చదవాల్సిన అవసరం తప్పుతుంది. గతంలో స్వల్ప ర్యాంకుల తేడాతో ప్రభుత్వ సీటు కోల్పోయిన మెరిట్ విద్యార్థులకు ఇప్పుడు డాక్టర్ అయ్యే సువర్ణావకాశం లభిస్తుంది.' అని సత్యకుమార్ పేర్కొన్నారు.
తాజా అదనపు సీట్ల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,090కి చేరుకుంది. ఇది వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ఒక గొప్ప వరమనే చెప్పాలి.
{{/usCountry}}తాజా అదనపు సీట్ల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,090కి చేరుకుంది. ఇది వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ఒక గొప్ప వరమనే చెప్పాలి.
{{/usCountry}}