...
...
Next Story

AP Pattadar Passbooks : మార్చి 2027 నాటికి 73 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ - సీఎం చంద్రబాబు

AP Pattadar Passbooks : ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటి నల్ల చట్టాలను రద్దు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మార్చి 2027 నాటికి 73 లక్షల మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించి రాష్ట్రాన్ని భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

Published on: Jul 9, 2026, 20:44:24 IST
Advertisement

AP Pattadar Passbooks : రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాబోయే మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రామంలో గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్….

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాటి ప్రభుత్వం తమకు నచ్చని ప్రజల భూములను ప్రభుత్వ భూముల జాబితా అయిన 22-A లో చేర్చిందని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టించి… ఆయా భూములను లాక్కోవడానికే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. చివరికి వఖ్ఫ్ బోర్డుకు చెందిన దాదాపు 2,100 ఎకరాల భూములను కూడా ఈ నిషిద్ధ జాబితాలోకి నెట్టేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలనే సంకల్పంతో 22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించిందని ఆయన వివరించారు.

"మార్చి 2027 నాటికి 72.7 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను భూవివాదాలు లేని ప్రశాంత రాష్ట్రంగా మార్చడమే మా కూటమి ప్రభుత్వ ఏకైక ధ్యేయం" అని సీఎం స్పష్టం చేశారు.

ప్రజల భూములను లాక్కోవడానికి, వారిలో భయాందోళనలు సృష్టించడానికి గత ప్రభుత్వం 'ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్' అనే ఒక నల్ల చట్టాన్ని తీసుకువచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేశామని గుర్తు చేశారు.

పారిశ్రామిక రంగంతో పాటు రాయలసీమను దేశంలోనే ఒక పెద్ద హార్టికల్చర్ (ఉద్యానవన) హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ప్రైవేటు రంగం ద్వారా మరో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటూ…. ఈ ప్రాంతంలోని లింగాల గ్రామంలో ఉన్న తలసరి ఆదాయం దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రావణ్ కేసుపై సీఎం రియాక్షన్….

యూట్యూబర్ బచలకురి జోసెఫ్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. హిందూ దేవుళ్లయిన శ్రీరాముడు, సీతాదేవిపై జోసెఫ్ అత్యంత అసభ్యకరమైన పోస్టులను అప్‌లోడ్ చేశాడని, అలాగే ఉగ్రవాదానికి, పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడాడని చంద్రబాబు ఆరోపించారు. 'ప్రశ్న రావణ్ ' పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన జోసెఫ్‌ను, ఏడు నెలల క్రితం అతడు చేసిన వివాదాస్పద వీడియో ఆధారంగా ఇటీవలే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

జోసెఫ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహాయం అందించిందని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. "రావణుడిని ప్రోత్సహించే వాళ్లు కూడా బయటకు వచ్చి హే రామ్ అంటూ జపం చేయడం చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు," అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe