పవన్ కల్యాణ్‌కు అభినవ కృష్ణ దేవరాయ బిరుదు.. ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు.

Published on: Dec 7, 2025, 20:25:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతోత్సవ్ ముగింపు కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ.. పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదును ప్రదానం చేశారు.

ఉడుపిలో పవన్ కల్యాణ్
ఉడుపిలో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకుని రోడ్డు మార్గంలో ఉడుపి చేరుకున్నారు. గీతోత్సవ్ కార్యక్రమం ఒక నెల క్రితం ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గీతోత్సవ్ ముగింపు కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. భోజనం తర్వాత, ఆయన శ్రీ కృష్ణ మఠానికి వెళ్లి దర్శనం చేసుకుని, స్వామీజీని కలిసి మాట్లాడారు. తరువాత జరిగిన గీతోత్సవ్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎం గానో, ప్రజా సేవకుడిగానో రాలేదన్నారు. ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానన్నారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్య నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీకి ఎన్నికలు ముందుగా తాను కూడా అర్జునుడిలాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సు ముఖ్యమన్నారు. ధర్మాన్ని అనుసరించే.. కేవలం 21 స్థానాలకే పరిమితమైనట్టుగా వెల్లడించారు.

'భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజా గదిలో పెట్టే గ్రంథం కాదు. జీవితంలో ఎదురయ్యే.. ప్రతీ నిర్ణయంలో, ప్రతీ గందరగోళంలో, ప్రతీ అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుంది. మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుంది. ప్రస్తుతం యువతరం నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలు ఎదుర్కొంటోంది. వారికి అత్యంత అవసరమైన మానసిక బలం, భావోద్వేగ నిలకడను గీత అందిస్తుంది.' అని పవన్ చెప్పారు.

మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడిందని పవన్ అన్నారు. ఇది ఆయుధాలు లేదా సంపదతో కాదని స్పష్టం చేశారు. కేవలం ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లేనని పేర్కొన్నారు. ఐన్‌స్టీన్ నుంచి ఓపెన్ హైమర్ దాకా ఎంతోమంది ప్రపంచ మేధావుల ఆలోచనలు గీత శతాబ్దాలుగా ప్రభావితం చేస్తుందన్నారు.

'ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమావేశమైనప్పుడు వసుధైక కుటుంబ అనే ప్రాచీన భారతీయ దార్శనికతకు జీవం పోస్తారు. ఇదే నేడు ప్రపంచానికి భారత్ అందిస్తున్న సందేశం. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వారసత్వం ద్వారా మన ఆధ్యాత్మిక సంపదను కాపాడిన వారిని స్మరించుకోవాలి.' అని పవన్ చెప్పుకొచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More