కృష్ణ గారిలానే మహేశ్ బాబు ప్రొడ్యూసర్స్ హీరో- రాజమౌళి 15 ఏళ్ల క్రితం మాటిచ్చారు- వారణాసి నిర్మాత కేఎల్ నారాయణ కామెంట్స్
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీయెస్ట్ మూవీ వారణాసి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రివీల్ చేశారు. ఈ సందర్భంగా వారణాసి నిర్మాత కేఎల్ నారాయణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా టైటిల్ను ఇటీవల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.

కేఎల్ నారాయణ కామెంట్స్
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ వారణాసి సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత గ్రాండ్గా నిర్వహించిన వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కు మహేశ్ బాబు, రాజమౌళి, కీరవాణి, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారణాసి నిర్మాత కేఎల్ నారాయణ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ .. "పదిహేనేళ్ల క్రితం నేను మహేష్ బాబు గారి వద్దకు వెళ్లి రాజమౌళితో సినిమా చేద్దామా? అని అడిగాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తరువాత రాజమౌళి గారి వద్దకు వెళ్లి అడిగాను. నాకున్న కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత చేస్తాను అని రాజమౌళి గారు మాట ఇచ్చారు. ఇప్పుడిలా పదిహేనేళ్ల తరువాత మేం మీ ముందుకు వస్తున్నాం" అని అన్నారు.
ఆయన ఏమి మారలేదు
"ఈ 15 ఏళ్లలో రాజమౌళి గారు ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ, ఆయన నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేసి పెడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ఏమీ మారలేదు. సినిమా తీసే విధానం, ఆయన ప్రవర్తించే విధానం, సినిమా పట్ల ఆయనకుండే విజన్, ఆయన సింప్లిసిటీ ఏమీ కూడా మారలేదు" అని కేఎల్ నారాయణ తెలిపారు.
"అడిగిన వెంటనే ఒప్పుకున్న పృథ్వీరాజ్ గారికి, ప్రియాంక చోప్రా గారికి ధన్యవాదాలు. మహేష్ బాబు గారు ఆయన తండ్రి (సూపర్ స్టార్ కృష్ణ)లానే ప్రొడ్యూసర్స్ హీరో. నా మొదటి సినిమా క్షణక్షణంకి మ్యూజిక్ అందించిన కీరవాణి ఇప్పుడు ఆస్కార్ గ్రహీత అయ్యారు. మళ్లీ ఆయనతో ఇలా పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాం" అని కేఎల్ నారాయణ వెల్లడించారు.
ఆ కోరిక కూడా నెరవేరింది
ఇదే ఈవెంట్లో చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడారు. "మా నాన్న గారు చెప్పిన ప్రతీ మాటను నేను విన్నాను. ఒక్క మాట తప్పా. పౌరాణిక పాత్రలు పోషించమని చెప్పిన ఆయన మాటను మాత్రం నేను వినలేదు. ఈ చిత్రంతో ఆ కోరిక కూడా నెరవేరింది. మా నాన్న గారు ఎక్కడున్నా కూడా ఈ రోజు నా మాటల్ని విని సంతోషిస్తారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోని ఉంటాయి" అని అన్నారు.
"‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అందరినీ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా దర్శకుడ్ని గర్వపడేలా చేస్తాను. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు మన భారతీయులంతా గర్వపడతారు. ఇది కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతోందో మీ (అభిమానులు) ఊహకే వదిలేస్తున్నాను" అని మహేశ్ బాబు తెలిపారు.
నాకు అది మాత్రమే తెలుసు
"అభిమానుల ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడతాను, నాకు అది మాత్రమే తెలుసు. ఈ ఈవెంట్ను మేమెంతో కష్టపడి మీ (అభిమానులు) కోసం ఏర్పాటు చేశాం. అందరూ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లండి" అని మహేష్ బాబు కోరారు.













