PM Modi On Markapuram Accident : మార్కాపురం ఘటన అత్యంత విషాదకరం - ఎక్స్ గ్రేషియాపై ప్రధాని మోదీ ప్రకటన
మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను వెలికితీశారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అత్యంత విషాదం - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఈ సాయాన్ని అందిస్తామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం - సీఎం
“మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాకు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు - టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించాను. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించాను. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తున్నది” అని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.
ఘటనాస్థలికి హోంమంత్రి అనిత:
మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమన్నారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు అదేశం.
జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హుటాహుటిన విజయవాడ నుండి మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రమాద ఘటనా స్థలానికి బయలుదేరారు. ఎప్పటికప్పుడు అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు.
ఈ ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “రోడ్డు ప్రమాదాల వల్ల నిండు ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదంగా ఉంటుంది. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం” అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

