అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - ఎక్స్గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి -చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా… 20 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

ఎక్స్గ్రేషియా ప్రకటన
ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమన్నారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.
ఘాట్ రోడ్డులో ప్రమాదం….
చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య సేవలు కొనసాగుతున్నాయని అల్లూరి జిల్లా కలెక్టర్ తెలిపారు.
“అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడి పలువురు భక్తులు మృతి చెందారన్న వార్త కలిచివేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులను సహాయక చర్యల కోసం అప్రమత్తం చేయడం జరిగింది. ప్రమాద స్థలంలో క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని చింతూరు ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది” అని హోంమంత్రి అనిత వంగలపూడి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.














