ఆ 1000 కుటుంబాలకు 15 రోజుల్లో తాడ్వాయి వద్ద ఇళ్ల స్థలాలు.. పట్టాల పంపిణీ!

పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాసితులైన కుటుంబాలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published on: Mar 02, 2026 8:31 PM IST
By , Polavaram
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. పోలవరం జిల్లాలోని ముంపునకు గురయ్యే మండలాలైన వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల నుంచి నిర్వాసితులైన కుటుంబాలను తరలించేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ (X)
పోలవరం ప్రాజెక్ట్ (X)

మొదటి దశలో 1,000 కుటుంబాలను ఏలూరు జిల్లాలోని తాడ్వాయికి తరలిస్తామని అధికారులు ప్రకటించారు. అక్కడ ప్రస్తుతం స్థల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాబోయే రెండు వారాల్లో నిర్వాసిత కుటుంబాలకు 1,000 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టుగా సమాచారం. 41.15(బి) కాంటూర్ స్థాయి కిందకు వచ్చే కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో ముంపు ప్రభావం గణనీయంగా ఉంది.

ఈ మూడు మండలాల్లో దశలవారీగా తరలింపు కోసం మొత్తం 14,000 కుటుంబాలను గుర్తించారు. అభ్యంతరాలు, ధృవీకరణ సమస్యల కారణంగా దాదాపు 4,000 కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కూనవరం మండలంలోని తొమ్మిది గ్రామాల నుండి 4,355 కుటుంబాలు, వీఆర్‌పురం మండలంలోని 16 గ్రామాల నుండి 5,795 కుటుంబాలు, చింతూరు మండలంలోని ఆరు గ్రామాల నుండి 3,667 కుటుంబాలు ఉన్నాయి. వివాదాస్పద కేసులను తదుపరి పరిశీలన కోసం పక్కన పెట్టి, రికార్డులు స్పష్టంగా ఉన్న కుటుంబాలను తరలించాలని అధికారులు నిర్ణయించారు. చింతూరు, వీఆర్‌పురం మండలాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు భద్రత, ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ సమగ్రతను ఆడిట్ చేయడానికి వెంటనే ఒక స్వతంత్ర అంతర్జాతీయ సమీక్ష ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల కమిషన్(సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.

డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన అన్ని రోజువారీ కాంక్రీట్ పోర్ లాగ్‌లు, నాణ్యత నియంత్రణ నివేదికలు, నిర్మాణ సమగ్రతను అంచనా వేయడానికి నిర్వహించే క్రాస్-వాల్ సోనిక్ లాగింగ్(సీఎస్ఎల్) పరీక్షల ఫలితాలను బహిరంగంగా ఉంచాలని సెంటర్ ఫర్ లిబర్టీ డిమాండ్ చేసింది.

గ్యాప్-Iలో ఫౌండేషన్ ట్రెంచ్ స్థాయిలను 23 మీటర్ల నుండి 24 మీటర్లకు ఆమోదించారని, ఎత్తుకు తగిన సమర్థన లేదా ఆమోదం లేకుండా మార్చడం సరికాదని వెల్లడించింది. ఇటువంటి ఏకపక్ష మార్పులు ఆనకట్ట పునాది స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని వాదించింది. ఇంజనీరింగ్ ఉల్లంఘనలను కొనసాగించడం వల్ల దిగువ జనాభా ప్రమాదంలో పడుతుందని సెంటర్ ఫర్ లిబర్డీ హెచ్చరించింది. లేవనెత్తిన అంశాలను వెంటనే పరిష్కరించకపోతే కోర్టు పర్యవేక్షణలో భద్రతా ఆడిట్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.