AP : ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో హెర్బల్ గార్డెన్స్ - కార్యాచరణ ప్రారంభం..!
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటలను పెంచనున్నారు. ఆ దిశగా వైద్యారోగ్య కార్యాచరణను సిద్ధం చేసింది. తులసి, ఆమ్లాతో పాటు ఇతర ఔషధ మొక్కలను వీటిల్లో పెంచుతారు. ఆస్పత్రుల్లో చేరే రోగులు… ఈ తోటల్లో సేదదీరే విధంగా కూడా ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల (హెర్బల్ గార్డెన్స్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటతారు అలాగే వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు అనువైన స్థలాలను వైద్యారోగ్యశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
హెర్బల్ మొక్కలు (representative image ) (image Pixel )
డీఎంఈ పరిధిలో తొలి విడత…!
తొలి విడతలో డైరెక్టరేటు ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న అన్ని బోధనాసుపత్రులు, ప్రత్యేక స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పూల, ఔషధ మొక్కలతో కూడిన తోటలను ఏర్పాట చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఎంఈ పరిధిలో ఉన్న అన్ని బోధనాసుపత్రులు, విశాఖలోని స్విమ్స్, ఈఎన్టీ, తిరుపతిలోని మెటర్నటీ ఆసుపత్రి, పలాసలోని కిడ్నీ రీసెర్చి ఇన్స్టిట్యూట్, ఇతర ప్రత్యేక ఆసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కూడా ఈ తోటల ఏర్పాటులో భాగస్వామ్యం కానుంది.
తులసి, ఆమ్లా… ఇతర ఔషధ మొక్కలు!
అసుపత్రుల్లో అందుబాటులో ఉన్న స్థలాల లభ్యత అనుసరించి తులసి, ఆమ్లా, బిల్వపత్ర, మునగ, ఆశ్వగంధ, రోస్మేరి, రణపాల, కలబంధ (ఆలోవెరా), అశోక, పసుపు, బ్రహ్మి వంటి ఔషధ మొక్కలను నాటతారు. కనిష్ఠంగా 15 నుంచి 40 రకాల మొక్కలను తోటల్లో పెంచేందుకు వీలుంది. కనీసం అర ఎకరా వరకు స్థలం అందుబాటులో ఉంటే దానిని తోటగా తీర్చిదిద్దుతారు.
వీటిల్లో రోగులు నడిచేందుకు వాకింగ్ ట్రాకింగులను ఏర్పాటు చేస్తారు. ఇన్ పేషంట్లుగా ఉన్న వారితో ఉండే సహాయకులు కాసేపు ఈ తోటల్లో సేదదీరే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ తోటల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు.
ఈ తోటల ఏర్పాటుకు దాతల నుంచి ఆర్ధిక సహకారం కూడా తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన డిపార్ట్మెంట్ రివ్యూ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఔషధ మొక్కల తోటల ఏర్పాటు పై ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.